సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు బయో మెట్రిక్ హాజరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్త సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ.. వేతనాల చెల్లింపుతో అనుసంధానం చేస్తూ గతంలో ఆదేశాలిచ్చారు.
అలాగే గ్రామ, వార్డు వలంటీర్లు కూడా బయోమెట్రిక్ హాజరు వేయాలని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్రామ, వార్డు సచి వాలయాల ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరుతో జీతాల అనుసంధానాన్ని నిలుపుదల చేస్తున్నామని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని భరత్ గుప్త పేర్కొన్నారు. అలాగే గ్రామ, వార్డు వలంటీర్లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.