తోబుట్టువుగా తోడుంటా చెల్లెమ్మా..!: ఎమ్మెల్యే తోపుదుర్తి

11 Dec, 2022 08:31 IST|Sakshi
ఆడపడుచులకు వడిబియ్యం అందిస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి దంపతులు    

అక్కచెల్లెమ్మలకు వడిబియ్యం అందించిన ఎమ్మెల్యే దంపతులు 

తోపుదుర్తిలో మూడువేల మందికి పసుపు కుంకుమ   

సాక్షి, అనంతపురం: ప్రతి ఇంటా ఆనందంగా ఉండాలన్నదే నాకోరిక ..మీకు ఏ సమస్య వచ్చినా తోబుట్టువుగా తోడుంటా అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అక్కచెల్లెమ్మలకు అభయమిచ్చారు. మండలంలోని తోపుదుర్తి గ్రామంలో మూడురోజులుగా బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.

శనివారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆయన సతీమణి మనోరమ కలిసి తోపుదుర్తి గ్రామంలో ఆడపడుచులకు వడిబియ్యం పెట్టారు. పట్టు చీరలు, పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళా తనకు ఆడపడుచుతో సమానమని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మహిళల అభ్యున్నతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి, వారి ఆర్థికాభివృద్ధికి ఆసరాగా నిలిచారన్నారు.

రాప్తాడు నియోజకవర్గంలో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో త్వరలోనే మహిళా సహకార డెయిరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గార్మెంట్స్‌ పరిశ్రమల ద్వారా ఎంతో మందికి త్వరలోనే మహిళలకు ఉద్యోగాలు అందిస్తామని తెలిపారు. ఆడపడుచుల ఆశీర్వాదాలు ఉన్నంత వరకూ ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని ఆపలేరన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. 

చదవండి: (తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌)

మరిన్ని వార్తలు