నరసరావుపేట: రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు తోటిబ్యాచ్ కానిస్టేబుళ్లు ఆర్థిక సహాయం చేయటం అభినందనీయమని జిల్లా ఎస్పీ వై.రవిశంకర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన ఇరువురి కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ.10.93 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. 2011 బ్యాచ్కు చెందిన ఎన్.అశోక్, యడ్లపాడు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ, ఈ ఏడాది మార్చి 6వ తేదీన కోటప్పకొండ బందోబస్తు విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, చిలకలూరిపేట పట్టణ శివారులో అతడి బైకును వెనుకనుంచి టిప్పర్లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అతడికి తోటి బ్యాచ్ కానిస్టేబుళ్లు అందరూ కలసి తమ వంతు సహాయంగా ఇచ్చిన రూ.8 లక్షలు చెక్కు, పోలీస్ అసోసియేషన్ నుంచి చేయూత పథకం కింద మంజూరైన మరో రూ.లక్ష చెక్కును కానిస్టేబుల్ భార్య సీహెచ్ లక్ష్మీదేవికి అందజేశారు. అదేవిధంగా జిల్లా ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ పనిచేస్తున్న ఎస్.గోపిరెడ్డి, మార్చి మూడో తేదీన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీస్ అసోసియేషన్ నుంచి చేయూత పథకం కింద రూ.లక్ష చెక్కు, ఏఆర్ విభాగం అందించిన రూ.93 వేలు నగదును ఆ కానిస్టేబుల్ భార్య కె.పూర్ణిమకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. అదనపు అడ్మిన్ ఎస్పీ ఆర్.రాఘవేంద్ర, ఏఆర్ అదనపు ఎస్పీ డి.రామచంద్రరాజు, ఏఆర్ డీఎస్పీ గాంధిరెడ్డి, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.మాణిక్యాలరావు, 2011 బ్యాచ్ కానిస్టేబుళ్లు సీహెచ్ అనంత్, ఎస్.శివప్రసాద్, కె.రాయపరెడ్డి, షేక్ ఎం.బాషా, కె.మధుబాబు, శివరాంప్రసాద్, రత్నకిషోర్ పాల్గొన్నారు.