కొత్త ఈవీ పాలసీ

16 Mar, 2024 05:39 IST|Sakshi

కేంద్రం ఆమోదం

కనీస పెట్టుబడి విలువ రూ. 4,150 కోట్లు  

దిగుమతులపై సుంకాలపరమైన మినహాయింపులు

టెస్లా తదితర సంస్థల ఎంట్రీకి మార్గం సుగమం ..

న్యూఢిల్లీ: టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్‌ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్‌ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్‌ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది.  

ప్రభుత్వం అనుమతి లేఖ ఇచి్చన తేదీ నుంచి అయిదేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి కారును (సీబీయూ)ని దిగుమతి చేసుకుంటే.. ఇంజిన్‌ పరిమాణం, ఖరీదు, బీమా, రవాణా (సీఐఎఫ్‌) మొదలైనవి కలిపి విలువను బట్టి 70 శాతం నుంచి 100 శాతం దాకా కస్టమ్స్‌ సుంకాలు ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి భారత్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు, పేరొందిన అంతర్జాతీయ ఈవీల తయారీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడగలదని కేంద్రం పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ పెరుగుతుండటం, అమెరికాకు చెందిన టెస్లా, వియత్నాం సంస్థ విన్‌ఫాస్ట్‌ మొదలైనవి ఇక్కడ ఇన్వెస్ట్‌ చేయడంపై ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో కొత్త విధానం ప్రాధాన్యం సంతరించుకుంది.  

 స్కీముకి సంబంధించి మరిన్ని వివరాలు..
► ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్‌ 4 వీలర్ల ఉత్పత్తి కోసం భారత్‌లో కనీసం రూ. 4,150 కోట్ల (500 మిలియన్‌ డాలర్ల) పెట్టుబడితో తయారీ ప్లాంటు నెలకొల్పాలి.  
► కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అనుమతి మంజూరు చేసిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోగా ప్లాంటును ఏర్పాటు చేయాలి. ప్రాథమికంగా దేశీయంగా కనీసం 25 శాతం విలువను (డీవీఏ) జోడించాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలి. డీవీఏని 50 శాతానికి పెంచి, కనీసం రూ. 4,150 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం పూర్తయిన తర్వాతే బ్యాంక్‌ గ్యారంటీలను ప్రభుత్వం వాపసు చేస్తుంది.  
► తక్కువ సుంకాలతో గరిష్టంగా ఏడాదికి 8,000 ఎలక్ట్రిక్‌ ఫోర్‌ వీలర్లను దిగుమతి చేసుకోవచ్చు. వార్షిక పరిమితి కన్నా తక్కువగా దిగుమతి చేసుకుంటే మిగతాది తర్వాత ఏడాదికి క్యారీఫార్వార్డ్‌ చేసుకునేందుకు వీలుంటుంది.
► స్కీమును నోటిఫై చేసిన సుమారు 120 రోజుల్లో దరఖాస్తులను ఆహా్వనిస్తారు. కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 120 రోజుల్లోగా వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

Election 2024

మరిన్ని వార్తలు