రూ.20 వేలతో రూ.100 కోట్లు సంపాదించొచ్చా..?

26 Dec, 2023 11:47 IST|Sakshi

బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనేది ఒకప్పటి మాట. కానీ చదువు అనంతరం మంచి బిజినెస్‌ ఐడియాతో కోట్లు గడించవచ్చనేది నేటి ట్రెండ్‌. చాలా మంది యువత మంచి బిజినెస్‌ ఐడియాతో తాము అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలి సొంతంగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోట్లల్లో టర్నోవర్‌ చేస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 

బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో బిరాజా రౌత్‌ ఆయన 21వ ఏట సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయనకు బర్గర్‌లంటే చాలా ఇష్టం. ఒక మంచి భారతీయ బ్రాండ్ బర్గర్‌లను తయారు చేసి విక్రయించాలనే ఆలోచన వచ్చింది. దాంతో 2011లో తన టెక్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం రూ.20 వేలు పెట్టుబడితో చిన్నస్థాయిలో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. తొలుత తాను పనిచేసిన ఆఫీసు సమీపంలో రోడ్డుపై కియోస్క్ ఏర్పాటు చేసి బర్గర్లు అమ్మడం మొదలుపెట్టాడు.

రౌత్‌ గతంలో పనిచేసిన కంపెనీలోని తన సహచర ఉద్యోగులు, మిత్రులు తొలుత కస్టమర్లుగా మారారు. ఆయన తయారుచేస్తున్న గ్రిల్డ్ బర్గర్ రుచి నచ్చటంతో సమీపంలోని కంపెనీల్లో పనిచేస్తున్న వారుసైతం ఆయన బిజినెస్‌కు కస్టమర్లుగా మారారు. దాంతో బెంగళూరులో రౌత్‌ తయారుచేస్తున్న బర్గర్ మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్ వంటి బ్రాండ్‌లకు గట్టి పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. దాంతో అతడు ‘బిగ్గీస్ బర్గర్’ పేరుతో కొత్త బ్రాండ్‌ను సృష్టించి దాని ద్వారా తన వ్యాపారం సాగించాడు. అలా ఎలక్ట్రానిక్ సిటీలో అతడు వ్యాపారం ప్రారంభించిన చోటుకు నగరంలోని చాలా మంది కస్టమర్లు బర్గర్‌ రుచి చూసేందుకు వచ్చేవారు. 

ఇదీ చదవండి: ‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు

అలా ఫుడ్ లవర్స్ మనసు గెలుచుకోవటంతో బిగ్గీస్ బర్గర్‌ క్రమంగా లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. 2023 నాటికి బిగ్గీస్ బర్గర్ కంపెనీ ఆదాయం రూ.100 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రౌత్ తన వ్యాపారాన్ని టైర్-2,3 నగరాలకు విస్తరించాలనే యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్గీస్ బర్గర్ 14 రాష్ట్రాల్లోని 28 నగరాల్లో 130 శాఖలను విస్తరించింది. 2024లో వీటి సంఖ్యను 350కి పెంచాలని చూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు