ఇంజనీరింగ్‌ చదివారు.. గంజాయి అమ్ముతూ బుక్కయ్యారు!

17 Jun, 2021 08:13 IST|Sakshi
బిహార్‌వాసి సుధాంశు, రేణుక 

బెంగళూరులో యువతి అరెస్టు పరారీలో ప్రియుడు

బనశంకరి: ఇద్దరూ ఇంజనీరింగ్‌ పట్టభద్రులు. కష్టపడితే మంచి భవిష్యత్తు. కానీ తప్పుదోవ తొక్కి కష్టాల్లో పడ్డారు. ప్రియుని ఒత్తిడితో గంజాయి అమ్ముతూ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రేణుక (25) యువతి బెంగళూరు సదాశివనగర పోలీసులకు పట్టుబడింది. ఆమె ప్రియుడు సిద్ధార్థ్‌ పరారీలో ఉన్నాడు. చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ చదివిన రేణుక, కడప జిల్లావాసి సిద్ధార్థ్‌ ఇద్దరూ ఒకే బ్యాచ్‌. కాలేజీలో ప్రేమలో పడ్డారు. చదువు ముగిశాక రేణుక చెన్నైలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. సిద్ధార్థ్‌ మాత్రం విలాసవంత జీవితంపై మోజుతో డ్రగ్స్‌ ముఠాలతో కలిశాడు. నేను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించానని, ఇందులో చాలా డబ్బు వస్తుందని రేణుకకు చెప్పాడు. సరేనని ఆమె ఉద్యోగం వదిలిపెట్టి ప్రియునితో కలిసి డ్రగ్స్‌ దందాలోకి దిగింది.

లాక్‌డౌన్‌లో గంజాయి విక్రయాలు  
గతేడాది కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రేణుకను గంజాయి విక్రయానికి బెంగళూరుకు పంపించాడు. ఆమె మారతహళ్లి సమీపంలోని పీజీ హాస్టల్‌లో ఉండేది. బిహార్‌కు చెందిన సుధాంశు అనే వ్యక్తితో కలిసి గంజాయి విక్రయాలు ప్రారంభించింది. ప్రియుడు సిద్ధార్థ్‌ పెద్దమొత్తంలో గంజాయిని తీసుకువస్తే రేణుక చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మేది. మంగళవారం రాత్రి సదాశివనగర ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నట్లు తెలిసి సీఐ ఎంఎస్‌ అనిల్‌కుమార్, ఎస్‌ఐ లక్ష్మీలు దాడి చేసి రేణుక, సుధాంశును అరెస్ట్‌ చేశారు. ఇద్దరినీ పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ప్రియుని మాటలను నమ్మి తప్పు చేశానని రేణుక విలపించింది. సిద్ధార్థ్‌ కోసం గాలిస్తున్నారు.

చదవండి: బాబోయ్‌ కుళ్లిన శవం వాసన.. సెల్ఫీలకు క్యూ కట్టిన జనం

మరిన్ని వార్తలు