సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఈ క్రమంలో అరెస్టైన నటి లావణ్య కస్టడీ కోరుతూ సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఐదు రోజులపాటు ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు.
ఇక ఈ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. విజయవాడ నుంచి ఉన్నత చదవుల కోసం లావణ్య హైదరాబాద్కు వచ్చినట్లు తేలింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్ల కోసం ప్రయత్నించినట్లు వెల్లడైంది. షార్ట్ ఫిలిం, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె.. జల్సాలకు అలవాటు పడినట్లు తెలిసింది.
కస్టడీ పిటిషన్లో పేర్కొన్న అంశాలు
ఓ టాలీవుడ్ హీరోకు పరిచయమైన లావణ్య.. అతనికి ప్రియురాలిగా మారినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. మూడు నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులోఅనుమానితురాలిగా ఉంది. ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో ఉనిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్ర పరిశ్రమలో పలువురికి లావణ్య డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు లావణ్య సోషల్ మీడియా అకౌంట్లతో పాటు వ్యక్తిగత చాట్ పరిశీలిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలామంది వీఐపీలతో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసులో A3గా ఉన్న ఇందూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చదవండి: సారీ, నేను ఓడిపోయాను..!
అసలేం జరిగిందంటే..
కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న యువతి వద్ద డ్రగ్స్ ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగి పోలీసులు సోదాలు నిర్వహించి ఆమె నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. నార్సింగి నుంచి కోకాపేటకు వెళ్లే దారిలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉంటున్న లావణ్య అనే యువతి వద్ద ఆదివారం తనిఖీలు చేయగా 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
దాని విలువ రూ.50 వేల వరకు ఉండగా వాటితో పాటు ఓ సెల్ఫోన్, రెండు ట్యాబ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్ర ఎడ్డి అనే వ్యక్తి ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు యువతి తెలిపింది. యువతిని అరెస్టు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి 14 రోజులపాటు రిమాండ్కు పంపారు.