ఐటీ ఉద్యోగిని దారుణ హత్య.. అతడిగా మారిన ప్రియుడే కారణం

24 Dec, 2023 16:53 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నందిని దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. దీంతో ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. 

వివరాల ప్రకారం.. చెన్నై శివారులోని తాలంబూర్‌లో దారుణం జరిగింది. శనివారం రాత్రి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నందిని(25)ని ప్రియుడు వెట్రిమారన్‌(26) కిరాతకంగా హత్య చేశాడు. వెట్రిమారన్‌ మొదట నందినిని బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచి, అనంతరం ఆమెను గొలుసులతో బంధించి, చివరగా ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. సగం కన్నా ఎక్కువ కాలిపోయి ఉన్న డెడ్‌బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

అయితే.. నందిని, వెట్రిమారన్‌ మధురైలోని ఒకే ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్నారని పోలీసులు తెలిపారు. ఎనిమిది నెలల క్రితమే వీరిద్దరూ ఒకే కంపెనీలో జాబ్‌ చేస్తున్నారని, ప్రేమించుకుంటున్నారని వెల్లడించారు. కాగా, నందినిపై అనుమానంతోనే వెట్రిమారన్‌ ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించారు. ఈ కేసులో వెట్రిమారన్‌ను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపినట్టు తెలిపారు. అయితే, ఈ హత్యలో ఓ ట్రాన్స్‌జెండర్‌ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇక్కడ, మరో ట్విస్ట్‌ ఏంటంటే.. వెట్రిమారన్‌ అలియాస్‌ పాండి మహేశ్వరి గత ఆరు నెలల క్రితమే అబ్బాయిగా మారడం గమనార్హం. మహేశ్వరి.. వెట్రిమారన్‌గా అబ్బాయిగా పేరు మార్చుకున్నాడు. దీంతో, కొద్దిరోజులుగా వెట్రిమారన్‌ను నందిని దూరం పెడుతుండటంతోనే ఆమెను హత్య చేసినట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు