రామన్నపేట: యువ ఓటర్లు చుట్టుపక్కల ఉన్న ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యపర్చాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. మంగళవారం ములుగు రోడ్డులోని ఎల్బీ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ‘నైబర్ హుడ్ యూత్ –2024’ను నిర్వహిచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సిక్తా మాట్లాడుతూ ఒక్కో యువ ఓటరు 18 ఏళ్లు నిండిన కనీసం పది మందిని ఓటర్లుగా నమోదు చేయించేలా కృషి చేయాలన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన జరగనున్న లోక్సభ పోలింగ్ రోజున తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ మాక్ పార్లమెంట్ ద్వారా విద్యార్థులు యువత ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ప్రొఫెసర్ నీవన్కుమార్, జాతీయ అవార్డు గ్రహీత అకులపల్లి మధు, నెహ్రూ యువకేంద్రం జిల్లా యువజన అధికారి అన్వేష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆరుణ డీహెచ్రావు పాల్గొన్నారు.
పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ పూర్తి
హన్మకొండ అర్బన్: లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ అధికారుల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖ అధికారులతో ర్యాండమైజేషన్ ప్రక్రియపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కేటాయింపు వివరాలతోపాటు, వారి మొదటి దశ శిక్షణ కార్యక్రమంపై చర్చించారు. ఈనెల 31, ఏప్రిల్ 1, 2 తేదీ ల్లో నగరంలోని కేడీసీ, పరకాల పాలిటెక్నిక్ కళాశాలల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్రెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధాశుక్ల్లా, డీఆర్ఓ వైవీ గణేష్, ఎన్ఐసీ డీఐఓ విజయ్కుమార్, సీపీఓ సత్యనారాయణరెడ్డి, డీఐఈఓ గోపాల్, ఈడీఎం శ్రీధర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ సురేష్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్: పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఎన్ఐసీ రూపొందించిన సాఫ్ట్వేర్ వినియోగిస్తూ ఆన్లైన్లో పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 106 వరంగల్ తూర్పు, 107 వర్ధన్నపేట, 103 నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 809 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన మొత్తం 4,338 మందిని మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు వెల్లడించారు.
యూత్ పార్లమెంట్ సదస్సులో
కలెక్టర్ సిక్తా పట్నాయక్