మాస్క్‌లు ధరించి ఉంటే లక్ష మరణాలు తగ్గేవి 

19 Nov, 2020 04:18 IST|Sakshi

వాషింగ్టన్ ‌: కరోనా ఆరోగ్య నియమాలను పాటించకుండా, మాస్కులు ధరించవద్దని ప్రదర్శనలు నిర్వహిస్తోన్న నిరసనకారులను మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ తప్పు పట్టారు. మాస్క్‌ ధరించని వారిని నగ్నంగా తిరిగేవారితో పోల్చి జోక్‌ చేశారు. అమెరికాలో మాస్క్‌లు ధరించడాన్ని రాజకీయ చేయడంపై ఇంటర్నెట్‌ ద్వారా ప్రసారం అయిన ఓ కార్యక్రమంలో కమేడియన్, సినీతార రషీదా జోన్స్‌తో కలిసి బిల్‌గేట్స్‌ మాట్లాడారు.

ప్యాంట్లు ధరించమని చెబితే కొద్ది మంది అమెరికన్లు అదేదో ఘోర తప్పిదంగా చూస్తున్నారని ఆయన అన్నారు. మొదట్లో కోవిడ్‌ని ఆరోగ్య నిపుణులు సాధారణ ఫ్లూ, జ్వరంతో పోల్చారని, అయితే తర్వాత ఇదొక తీవ్ర వైరస్‌గా మారిందని ఆయన వీక్షకులకు వివరించారు. సాధారణ జలుబుతో బాధపడే వ్యక్తులు మాస్కు లేకుండా ఇంట్లో ఇతరులతో కలిసి ఉండవచ్చని, అయితే కోవిడ్‌ సోకిన వారు అలా చేయడానికి వీల్లేదని ఆయన అన్నారు.

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఉంటే కనుక లక్ష మరణాలను నివరించగలిగేవారమని, వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ పరిశోధనలో తేలిందని బిల్‌ గేట్స్‌ గుర్తుచేశారు. వ్యాక్సిన్‌ అభివృద్ధికి  బిల్‌ గేట్స్‌ కోట్లాది రూపాయలను విరాళంగా ఇచ్చారు.

మరిన్ని వార్తలు