కరోనా: పెరుగుతున్న విటమిన్ల వాడకం

22 Sep, 2020 17:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్‌ విజంభన వల్ల ప్రపంచ దేశాల్లో విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిపోయింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నేడు ప్రజలు విటమిన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. రొమ్ము, అండాశయం తదితర క్యాన్సర్ల నుంచి బయట పడేందుకు ఏసీఈ విటమిన్లు దోహదం చేయడం కూడా విటమిన్ల వాడకాన్ని పెంచింది. గతేడాదితో పోలిస్తే ఒక్క బ్రిటన్‌లోనే విటమిన్ల వినియోగం ఏకంగా 17.3 శాతం పెరిగింది. 

నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 12 రకాల మొక్కలు, ఐదు రకాల జంతువుల నుంచి వస్తోన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అందుకనే ఇంకా విటమిన్లు, పోషక పదార్థాల కోసం ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. బంగాళా దుంపలో సీ విటమిన్‌తోపాటు బీ 6 విటమిన్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర వహించే డీ విటమిన్‌ లోపాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. అందుకు ఆధునిక జీవన విధానంతోపాటు వాణిజ్య ప్రపంచీకరణ కూడా కారణమే. క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో కూడా డీ విటమిన్‌ బాగా పని చేస్తోందని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సూర్య రశ్మి ద్వారా వచ్చే డీ విటమిన్‌ కోసం కూడా నేడు ప్రజలు సప్లిమెంట్లపై ఆధార పడాల్సి వస్తోంది. 
(చదవండి: భారత్‌లో తగ్గుతున్న ‘కరోనా మరణాలు’)

శరీరంలోని ‘యాంటీ ఆక్సిడెంట్లు’ తగ్గించడంలో ఏ, ఈ విటమిన్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఏ, ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే సప్లిమెంట్ల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటికి బదులుగా ఈ రెండు విటమిన్లు సహజంగా దొరికే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. ఇక ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్‌ ఉండే ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కూడా జీర్ణ శక్తి బాగా మెరగుపర్చడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా వైద్యులు సూచిస్తున్నారు. కే1, కే2 విటమిన్లు రక్త ప్రసరణలో ప్రముఖ పాత్ర వహిస్తాయని ఓ తాజా అధ్యయనంలో తేలింది. పాలకూర, బీట్‌రూట్, క్యాబేజీ, బీన్స్, కోడిగుడ్లు, బెర్రీస్, గ్రేప్స్, దానిమ్మ కాయల్లో ఈ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. 
(చదవండి: కరోనాను 'ఢీ'కొట్టండి)

మరిన్ని వార్తలు