కోవిడ్‌ వ్యాక్సిన్‌.. ట్రంప్‌‌ ఆసక్తికర వ్యాఖ్యలు

24 Jul, 2020 17:05 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రస్తుతం ప్రపంచ జనాభా అంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వ్యాక్సిన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్‌ దీనిపై స్పందిస్తూ.. కరోనా వ్యాక్సిన్‌ విషయంలో జనాలు తనపై తప్పక విమర్శలు కురిపిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘ఒకవేళ కరోనా వ్యాక్సిన్‌ను నేను ముందుగా తీసుకుంటే.. జనాలు ‘స్వార్థపరుడు, అందరి కంటే ముందు తనే తీసుకున్నాడు’ అంటారు. ఒకవేళ చివర్లో తీసుకుంటే.. ‘వ్యాక్సిన్‌ సరిగా పని చేయదనుకుంటా. అందుకే ఆఖర్న తీసుకున్నాడని’ అంటారు. ఏం చేసినా తప్పు పట్టడం మాత్రం కామన్’‌ అన్నారు ట్రంప్‌. (చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్‌)

డిసెంబరు నాటికి ఫైజర్, బయోఎంటెక్  కోవిడ్-19 వ్యాక్సిన్ 100 మిలియన్ల డోసుల పంపిణీ కోసం అమెరికా 1.95 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వరుసగా మూడవ రోజు 1000కి పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. యూఎస్‌ఏలో ఇప్పటివరకు 40 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులు, 1.4 లక్షల మరణాలు సంభవించాయి. 

మరిన్ని వార్తలు