మాస్కోలో మారణహోమం

24 Mar, 2024 05:20 IST|Sakshi

క్రాకస్‌ హాల్‌ కాల్పుల్లో 133కు చేరిన మృతులు

మరో 120 మంది చావుబతుకుల్లో

తమ పనేనని ప్రకటించిన ఐసిస్‌(ఖోరసాన్‌)

ఉక్రెయిన్‌ హస్తం ఉందన్న రష్యా

11 మంది అనుమానితుల అరెస్టు 

ఉక్రెయిన్‌కు పారిపోతూ పట్టుబడిన నలుగురు

మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్‌ సిటీ హాల్‌లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్‌ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్‌స్‌్కలో ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్‌ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది.

ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌(ఖోరసాన్‌) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్‌ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.

తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ చీఫ్‌ శనివారం రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్‌ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది.

మోదీ దిగ్భ్రాంతి
మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్‌ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.    

ఉక్రెయిన్‌కు సంబంధం ఉంది: పుతిన్‌  
కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని పుతిన్‌ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు.

మా పని కాదు: ఉక్రెయిన్‌
రష్యా కాల్పులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్‌ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్‌కు లేదన్నారు.  

పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చేశారు
► కాల్పులు జరిగిన క్రాకస్‌ సిటీ హాల్‌ చాలా విశాలమైన కాంప్లెక్స్‌. ఇందులో మ్యూజిక్‌ హాల్‌తోపాటు షాపింగ్‌ సెంటర్‌ ఉంది.
► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి.  
► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది.  
► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్‌ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి.  
► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్‌ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది.  
► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్‌లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.  

క్రాకస్‌ సిటీ హాల్‌లో కాల్పులు జరుపుతున్న దుండగులు

Election 2024

మరిన్ని వార్తలు