Controversies In Bigg Boss In 2023: పులి గోరు, ప్రెగ్నెన్సీ టెస్ట్‌, పారిపోయేందుకు స్కెచ్‌, విన్నర్‌ అరెస్ట్‌.. వార్తల్లో బిగ్‌బాస్‌!

23 Dec, 2023 16:26 IST|Sakshi

బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌.. ఈ షోని ఆరాధించే అభిమానులతో పాటు తిట్టిపోసే జనాలు సైతం ఉన్నారు. అయితే ఎంత తిట్టుకున్నా ఆ మ్యూజిక్‌ రాగానే చాలామంది టీవీలకు అతుక్కుపోయి మరీ బిగ్‌బాస్‌ చూస్తుంటారు. అదే ఈ షో ప్రత్యేకత! ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీలు ఇంట్లో ఎలా ఉంటారో చూపించాలన్నదే దీని కాన్సెప్ట్‌. వారికి ఇచ్చే ఛాలెంజ్‌లు, టాస్కులు అదనం.. దీని ద్వారా చూసే జనాలకు కాలక్షేపం.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు కాసుల వర్షం. కానీ షో ముగిసిన తర్వాత నెమ్మదిగా జనాలు వారిని మర్చిపోతుంటారు. అటు కంటెస్టెంట్లు కూడా బోలెడంత నెగెటివిటీతో బయటకు వస్తారు. పైగా ఛాన్సులు, ఫేమ్‌ అందుకోవడం అందని ద్రాక్షగా మారుతూ ఉంటుంది. టైటిల్‌ గెలిచామన్న సంతృప్తి తప్ప ఏదో కోల్పోయామన్న లోటు మాత్రం అలాగే ఉండిపోతుంది.

దాని తర్వాత మళ్లీ ఇప్పుడే అంత క్రేజ్‌!
బిగ్‌బాస్‌ తెలుగు రెండో సీజన్‌, నాలుగో సీజన్‌ తర్వాత మళ్లీ ఏడో సీజన్‌కు ఆ స్థాయిలో క్రేజ్‌ వచ్చింది. కంటెస్టెంట్ల కోసం అభిమానులు సోషల్‌ మీడియాలో యుద్ధాలే చేశారు. అంతిమంగా ఈ పోరులో రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో పల్లవి ప్రశాంత్‌ విజయం సాధించాడు. బిగ్‌బాస్‌ షో అనేది వ్యక్తిత్వ, మానసిక వికాస కేంద్రం అని అప్పట్లో బిగ్‌బాస్‌ ఓటీటీ విన్నర్‌ బిందుమాధవి తండ్రి అన్నాడు. అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి, తప్పొప్పులు సరిదిద్దుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదన్నాడు. కానీ ఇక్కడే ప్రశాంత్‌ను తప్పుదారి పట్టించాడు శివాజీ. హౌస్‌లో ప్రశాంత్‌ తప్పు చేయబోయిన ప్రతిసారి శివాజీ అడ్డుకున్నాడు. అతడిని మాట్లాడనీయకుండా చేశాడు.

టైటిల్‌ విజేత అరెస్ట్‌
అప్పుడే కనక శివాజీ అడ్డుపడకపోయుంటే ప్రశాంత్‌ స్వభావం అందరికీ తెలిసేది, తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చి ఉండేది. హౌస్‌లో ఉన్ననాళ్లూ మాస్క్‌ వేసుకుని నటించాడన్న మాట వచ్చుండేదే కాదు. బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే (డిసెంబర్‌ 17) రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఎంత ఉద్రిక్త వాతావరణం నెలకొందో అందరకీ తెలిసిందే!  ప్రశాంత్‌ను వెనక గేటు నుంచి వెళ్లిపోమన్నా ముందు నుంచే వెళ్తానన్నాడు. పోనీ, కారు ఆపకుండా వెళ్లిపోమని చెప్పినా లెక్క చేయలేదు. రైతుబిడ్డ అనే సింపతీ వాడాలనుకున్నాడు. పైగా అంతమంది అభిమానులు కనిపించడంతో మళ్లీ అదే స్టూడియో దగ్గరకు వచ్చాడు. దీంతో అక్కడ చెలరేగిన అలజడి అంతా ఇంతా కాదు. చివరకు ఏమైంది? పోలీసుల మాటల్ని బేఖాతరు చేసినందుకు అతడిని అరెస్ట్‌ చేసి జైల్లో వేశారు. టైటిల్‌ గెలిచిన ఒక్కరోజులోనే ప్రశాంత్‌ అప్రతిష్ట మూటగట్టుకున్నాడు.

టాలీవుడ్‌ స్టార్‌ హీరో వల్ల ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్‌
మరోవైపు తమిళంలో రన్‌ అవుతున్న బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ సైతం తరచూ వార్తల్లో ఉంటోంది. ఈ షోలో సీనియర్‌ హీరోయిన్‌ విచిత్ర పాల్గొంది. ఓ ఎపిసోడ్‌లో ఆమె ఇండస్ట్రీని వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. తెలుగులో ఓ స్టార్‌ హీరో పెట్టిన టార్చర్‌ వల్లే సినిమాలు వదిలేశానంది. ఆ హీరో తన గదికి రమ్మని పిలిస్తే వెళ్లలేదని.. దీంతో తనను షూటింగ్‌లోనూ చాలా ఇబ్బంది పెట్టారని చెప్పింది. తనను సెట్స్‌లోనూ అసభ్యంగా తాకాడని.. ఆ విషయం చెప్పినందుకు తన చెంపే పగలగొట్టారని వాపోయింది. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా ఆ హీరో బాలకృష్ణయే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

పారిపోయేందుకు యత్నం
ఇక ఇదే హస్‌లోని కంటెస్టెంట్‌ కూల్‌ సురేశ్‌ ఓ రోజు బిగ్‌బాస్‌ ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గోడ ఎక్కి పారిపోవడానికి యత్నించగా అది చూసిన ఓ కంటెస్టెంట్‌ పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని కిందకు దింపాడు. ఇదిలా ఉంటే హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య వార్‌, బయట అభిమానుల మధ్య వార్‌ సహజమే! కానీ లోపల కంటెస్టెంట్లు ఏదో అనుకున్నారని వారి కుటుంబసభ్యులపైనే దాడి జరిగింది. నటి వనితా విజయ్‌కుమార్‌ కూతురు జోవిక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంది. ఆమె ప్రదీప్‌ ఆంటోని అనే కంటెస్టెంట్‌పై తీవ్ర విమర్శలు చేసింది.

జోవిక ఆరోపణలు.. ప్రదీప్‌కు రెడ్‌ కార్డ్‌
ఆయన ఎప్పుడూ వాష్‌ రూమ్‌ వద్దే ఉంటున్నాడు.. ఆయన వల్ల ఇక్కడ ఉన్న అమ్మాయిలకు భద్రత లేదని జోవిక ఆరోపించింది. దీంతో కమల్‌ అతడికి రెడ్‌ కార్డ్‌ జారీ చేసి షో మధ్యలోనే అర్థాంతరంగా ఎలిమినేట్‌ చేశాడు. దీనివల్ల జోవికపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్‌ జరగ్గా దాన్ని తిప్పికొడుతూ వచ్చింది వనిత. ఓ రోజు బిగ్‌బాస్‌ షో గురించి రివ్యూ చెప్పి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. కంటెస్టెంట్‌ ప్రదీప్‌ ఆంటోని అభిమానే తనపై దాడి చేశాడని వనిత ఆరోపించింది.

A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar)

షో మధ్యలో కంటెస్టెంట్‌ అరెస్ట్‌
కన్నడ బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌ను షో మధ్యలో నుంచే పోలీసులు తీసుకెళ్లిపోయారు. వర్తూర్‌ సంతోష్‌ పులి గోరును మెడలో ధరించి దర్జా ప్రదర్శించాడు. దీంతో అటవీ అధి​కారులు అది నిజమైనదా? కాదా అని సెట్స్‌కు వెళ్లి మరీ పరీశిలించారు. అది నిజమైన పులి గోరేనని తేలడంతో అతడిని వెంటనే అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఇకపోతే బిగ్‌బాస్‌ షోలోకి యూట్యూబర్లు, సింగర్లు, డ్యాన్సర్లు, నటీనటులు వెళ్తుంటారు. కానీ తొలిసారి ఓ ఎమ్మెల్యే హౌస్‌లో అడుగుపెట్టాడు.

హౌస్‌లోకి ఎమ్మెల్యే
కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ కన్నడ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్లను మోటివేట్‌ చేశాడు. కంటెస్టెంట్‌గా కాకుండా అతిథిగా షోకి వెళ్లి వచ్చాడు. ఇక ఇదే షోలో ఓ శునకం ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. సదరు ఛానల్‌ కూడా 777 చార్లీ సినిమాతో ఆకట్టుకున్న చార్లీ అనే శునకం మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లనుందని ప్రకటించింది. కానీ పలు కారణాల రీత్యా ఇది కార్యరూపం దాల్చలేదు.

ప్రెగ్నెన్సీ టెస్ట్‌
బిగ్‌బాస్‌ షోలో దంపతులు పార్టిసిపేట్‌ చేయడం చూశాం. తెలుగులోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. కానీ తొలిసారి ఓ మహిళకు హౌస్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేశారు. హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌లో అంకితా లోఖండే- విక్కీ జైన్‌ కలిసి పాల్గొన్నారు. హౌస్‌లోకి వెళ్లిన నెల రోజుల తర్వాత తనకు ఇంకా పీరియడ్స్‌ రాకపోవడంతో అయోమయానికి లోనైంది అంకిత. దీంతో ఆమెకు రక్త, మూత్ర పరీక్షలు చేశారు. అయితే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో ఆమెకు నెగెటివ్‌ వచ్చింది. ఇలా ఈ ఏడాది ఏదో భాషలో ఏదో ఒక వార్తతో బిగ్‌బాస్‌ షో ట్రెండ్‌ అవుతూనే వచ్చింది.

చదవండి: బుల్లితెర జంట విడాకులు? ఇద్దరి తప్పు.. ఏడుస్తూ ఉండలేం కదా!

>
మరిన్ని వార్తలు