Anasuya: 'హీరోలంతా లైన్ వేయడానికే అనుకున్నా'.. అనసూయ కామెంట్స్ వైరల్!

6 Nov, 2023 18:07 IST|Sakshi

యాంకర్‌గా కెరీర్‌ మొదలెట్టిన అనసూయ.. ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ మారిపోయింది. ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనసూయ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను అనుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు చాలా ఉద్యోగాలు కూడా చేసినట్లు వెల్లడించింది. ఎంబీఏ చదివిన అనసూయ హెచ్‌ఆర్‌గా పనిచేశానని పేర్కొంది. అయితే ఇండస్ట్రీలో హీరోలపై చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. 

అనసూయ మాట్లాడుతూ.. ' నేను యాక్సిడెంటల్‌గానే ఇండస్ట్రీలోకి వచ్చా. క్షణం సినిమాలో నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా. కానీ సోగ్గాడే మూవీ ముందే రిలీజైంది. కేవలం రెండు వారాల గ్యాప్‌లోనే రెండు ఛాన్సులు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఛానెల్‌ షోలో పనిచేసేదాన్ని.  ఆ సమయంలో అక్కడే సడన్‌గా షూట్‌లోనే నన్ను అడిగారు. నాగార్జున సార్ సినిమా అనగానే ఒప్పేసుకున్నా. నాకు హలో బ్రదర్ అంటే చాలా ఇష్టం.' అంటూ చెప్పుకొచ్చింది. 

క్షణం సినిమాలో ఛాన్స్ రావడం పట్ల మాట్లాడుతూ..'నేను దేవిశ్రీ ప్రసాద్‌తో 2013లో పనిచేశా. ఆ టైంలో అడివి శేష్‌ కలిశాడు. అప్పుడు నేను అనుకునేదాన్ని. ఈ హీరోలంతా లైన్ వేయడానికే అప్రోచ్ అవుతారని అనిపించింది. అందుకే అప్పుడు అడివి శేష్‌ను బాగా అవాయిడ్ చేశా. ఓ మూడు నెలల తర్వాత ఒక కాఫీ షాప్‌లో అనుకోకుండా మేం కలిశాం. అక్కడ కూర్చోబెట్టి మీరు దొరకట్లేదని నేరేషన్ ఇచ్చారు. అప్పుడే నాకు అర్థమైంది. వాళ్ల సినిమాకు నా అవసరం ఉందనే విషయం. జబర్దస్త్‌లో నేను సీరియస్‌గా కనిపించడం అడివి శేష్ చూశారట. అందుకే ఆ పాత్రకు నేనే సెట్ అవుతారని అనుకున్నారు.' అని అన్నారు. కాగా.. అనసూయ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పుష్ప-2లో నటిస్తోంది. రవికాంత్‌లో దర్శకత్వంలో తెరకెక్కించిన క్షణం మూవీలో అడివి శేష్, అదా శర్మ జంటగా నటించగా.. అనసూయ కీలక పాత్రలో కనిపించింది. 

మరిన్ని వార్తలు