Kangana Ranaut: శరీర భాగాలు కాదు చూడాల్సింది.. ఆ పని చేసేవారిని కూడా!

25 Mar, 2024 18:55 IST|Sakshi

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మాటలతో బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమెకు బీజేపీ ఎంపీ సీటును కేటాయించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి కంగనా పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో కంగనాపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు.

తాజాగా యూపీకి చెందిన కాంగ్రెస్ మహిళానేత సుప్రియ శ్రీనాథే విమర్శలు చేసింది. గతంలో కంగనా సినిమాల్లో బోల్డ్‌గా నటించిన ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా ఇలాంటి ఫోటోలతో హిమాచల్ ప్రదేశ్ మండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన కంగనా తనదైన శైలిలో కాస్తా ఘూటుగానే రిప్లై ఇచ్చిపడేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. 

కంగనా తన ట్వీట్‌లో రాస్తూ.. 'ప్రియమైన సుప్రియా జీ.. ఒక ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌లో గత 20 ఏళ్లలో అన్ని రకాల మహిళా పాత్రలు పోషించా. నేను క్వీన్‌ చిత్రంలోని అమాయక అమ్మాయి నుంచి ధకడ్‌ సినిమాలో  గూఢచారిగా, మణికర్ణికలో దేవతగా, ‍అలాగే చంద్రముఖిలో దెయ్యంలా, రజ్జో చిత్రంలో వేశ్యగా.. అలాగే తలైవిలో విప్లవ నాయకురాలిగా నటించా. మన ఆడబిడ్డలను పక్షపాతమనే సంకెళ్ల నుంచి మనం విడిపించాలి. వారి శరీర భాగాల పట్ల ఉత్సుకత కంటే.. వాళ్లు ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకోవాలి. అన్నింటికీ మించి వారి జీవితాలను, పరిస్థితుల కారణంగా సెక్స్ వర్కర్లుగా మారిన వారిని ఏదో ఒక రకంగా దూషించడం మానుకోవాలి. ప్రతి స్త్రీ తన గౌరవానికి అర్హురాలని మనం గ్రహించాలి.' అంటూ రాసుకొచ్చింది.

ఇది చూసిన అభిమానులు కంగనాకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. చాలా బాగా బుద్ధి చెప్పావ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నెటిజన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో సుప్రియ శ్రీనాథే ఆ పోస్ట్‌ను తన ఇన్‌స్టా నుంచి తొలగించింది. కానీ కొద్ది సేపటికే ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం కంగనా ఎమర్జన్సీ అనే చిత్రంలో నటిస్తోంది. ఎన్నికల తర్వాత జూన్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 

Election 2024

మరిన్ని వార్తలు