రూ. 30 కోట్ల భారీ సెట్‌ ధ్వంసమైంది.. బోని కపూర్‌ ఆవేదన

23 May, 2021 11:01 IST|Sakshi

ఒకవైపు కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే.. మూలిగే నక్క మీద తాటిపండు పడడం అన్నట్లుగా తౌటే తుఫాన్‌ ​వచ్చి దేశంలో కల్లోలం సృష్టించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ తుఫాన్‌ ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా భారీగానే పడింది. బాలీవుడ్‌కు చెందిన చాలా సినిమాల సెట్టింగులు దెబ్బ తిన్నాయి. వందల కోట్ల నష్టం వాటిల్లింది. కేవ‌లం మైదాన్ అనే సినిమాకు సంబంధించి తుపాను కార‌ణంగా రూ.30 కోట్ల న‌ష్టం వాటిల్లింద‌ట‌. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బోని కపూర్‌ మీడియాకు వెల్లడించారు.

అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న మైదాన్ చిత్రం కోసం భారీ సెట్‌ను ముంబైలో వేశారు. అయితే తౌటే తుఫాన్ దాటికి ఆ సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో బోనికపూర్ మాట్లాడుతూ..‘గతేడాది లాక్‌డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్‌ను తొలిసారి కూలగొట్టాం. ఆ తర్వాత మళ్లీ రెండోసారి సెట్ వేసి చిత్రీకరించాం. ఆ తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత మరోసారి సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌటే తుఫాన్ ధాటికి మళ్లీ సెట్ అంతా కూలిపోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది ’అని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు