Dil Raju: సినిమా కోసం ప్రాణం ఇస్తా.. అలా రాసి మమ్మల్ని బలిపశుల్ని చెయ్యొద్దు: దిల్‌ రాజు

16 Aug, 2022 16:42 IST|Sakshi

టాలీవుడ్‌ నిర్మాతలంతా యూనిటీగా ఉంటామని, తమ మధ్య ఎప్పుడైనా ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంటుందని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు.  వ్యూస్‌ కోసమో, లేదా క్లిక్‌ కోసం తప్పుడు వార్తలు రాస్తూ ఇండస్ట్రీ వాళ్లని బలిపశువు చేయొద్దని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్తికేయ 2 సక్సెస్‌ మీట్‌లో దిల్‌ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల తనపై వచ్చిన పుకార్లపై స్పందించాడు. 

‘కార్తికేయ2 సినిమా రిలీజ్‌కు ముందు చాలా సార్లు నిఖిల్‌ నాతో మాట్లాడారు. జులై 8న ‘థాంక్యూ’చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ కుదర్లేదు. దీంతో అదే నెల 22న మా సినిమాను విడుదల చేయాలని భావించాం. ఇదే విషయాన్ని కార్తికేయ2 నిర్మాతల్లో ఒక్కరైన వివేక్‌తో చెప్పాను. ‘మీరు అల్రెడీ జులై 22కు విడుదల చేస్తామని పోస్టర్‌ వేసుకున్నారు కదా.. మాకు ఏమైనా అవకాశం ఇస్తారా ’అని వివేక్‌ని అడిగాను. మా హీరో, డైరెక్టర్‌తో మాట్లాడి చెప్తా అన్నారు.

(చదవండి: ‘కార్తికేయ 2’ సంచలనం.. మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌!)

తర్వాత ఒక్కరోజు నిఖిల్‌, చందు నన్ను కలిసేందుకు మా ఇంటికి వచ్చారు. మాట్లాడుకొని సినిమా విడుదల తేదిని మార్చుకున్నాం. అక్కడితో సమస్య తీరింది. ఆగస్ట్‌ 12న కార్తికేయ2 విడుదల చేస్తామని అనుకున్నారు. నేను సపోర్ట్‌ ఇస్తానని చెప్పాను. ఇలా చర్చలు జరుతుండగానే కొందరు ‘దిల్ రాజు సినిమాను తొక్కేస్తున్నాడు’అంటూ ఏవేవో రాసేశారు. ఇక్కడ ఎవరు ఎవరి సినిమాని తొక్కరు. అది రాసేవాళ్లకి, చదివేవాళ్లకు ఉండాల్సిన మినిమం కామన్‌సెన్స్‌.

ఇక్కడ ఎవరి సినిమా ఆడినా మేమంతా ఆనందపడతాం. ఒక్క సినిమా సక్సెస్‌ మాకు ఇంకో సినిమా తీయడానికి ఊపిరి పోస్తుంది. అంతేకానీ మాలో మాకు ఏదో క్రియేట్‌ చేస్తూ.. మీ క్లిక్స్‌ కోసం, వ్యూస్‌ కోసం మమల్ని బలిపశుల్ని చేయ్యొద్దు. వాస్తవాలు రాయండి. తెలియకుంటే తెలుసుకొని చెప్పండి. సినిమా కోసం నేను ప్రాణం ఇస్తాను. పాడు చేయాలని ఎప్పుడూ అనుకోను. డబ్బులు నష్టపోయి కూడా సినిమాలు విడుదల చేశాను. ఇవన్నీ మీకు తెలియదు’అంటూ దిల్‌రాజు ఎమోషనల్‌గా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు