Diwali 2022 Releasing Movies: దీపావళికి బాక్సాఫీస్‌ వద్ద బరిలోకి దిగుతున్న సినిమాలివే..

20 Oct, 2022 12:41 IST|Sakshi

పండగ సీజన్‌ అనగానే సినీ ప్రేక్షకులు కొత్తగా రిలీజ్‌ అయ్యే సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఇప్పటికే దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీపావళి సందర్భంగా యంగ్‌ హీరోలు బాక్సాఫీస్‌ వద్దబరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. 

మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘జిన్నా’. పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా  ఈ నెల 21న థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ట్రైలర్‌, పాటలతో మంచి హైప్‌ క్రియేట్‌ చేసుకుంది. దీనికి తోడు ప్రమోషన్స్‌ కూడా భారీగా చేయడంతో మూవీపై బజ్‌ ఏర్పడింది. మరి జిన్నాపైనే ఆశలు పెట్టుకున్న విష్ణు ఈ సినిమాతో హిట్‌ కొటతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. 

ఇక  యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జోడీగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో రూపొందిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఓరి దేవుడా’. విక్టరీ వెంకటేశ్ మోడ్రన్ దేవుడిగా ఎంటర్ టైన్ చేయబోతున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ ‘ఓ మై కడవుళే’ కు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళంలో అశోక్ సెల్వన్, రితికాసింగ్, వాణిబోజన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా అక్కడ హిట్ అయింది. డిఫరెంట్‌ జానర్‌తో వస్తున్న విశ్వక్‌ ఓరి దేవుడా అంటూ ఈనెల21న ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉంటుందన్నది చూడాలి.

దీపావళి కానుకగా రాబోతున్న మరో సినిమా ప్రిన్స్‌. శివ కార్తికేయన్‌,మారియా  హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ రెండు భాషలలోనూ ఈ సినిమా  ఈనెల 21న  విడుదల కాబోతుంది.ఇందులో శివకార్తికేయన్ స్కూల్ టీచర్‌గా నటించారు. నటుడు ఇందులో సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మాంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. దీనికి తోడు ప్రిన్స్‌ కోసం హీరో విజయ్‌ దేవరకొండ సైతం రంగంలోకి దిగి ప్రమోషన్స్‌ చేశారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. 

ఇక మరో తమిళ హీరో కార్తి కూడా ఈసారి దీపావళి బరిలోకి దిగుతున్నారు. కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్దార్‌. పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. రాశిఖన్నా,రజీషా విజయన్‌ ఇందులో హీరోయిన్స్‌గా నటించారు. నటి లైలా ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో దాదాపు 15 గెటప్పుల్లో కార్తి కనిపించనున్నట్లు తెలుస్తోంది. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 21న తెరపైకి రానుంది. ఇప్పటికే కార్తికి తెలుగులోనూ మంచి డిమాండ్‌ ఉంది. మరి ఈ సినిమాతో కార్తికి ఇంకో హిట్టు పడినట్లేనా అన్నది చూద్దాం. 

మరిన్ని వార్తలు