కాలేజీ నేపథ్యంలో వస్తోన్న 'రెబెల్'.. ఆసక్తిగా ఫస్ట్‌ లుక్ పోస్టర్!

27 Oct, 2023 13:16 IST|Sakshi

తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రెబెల్‌. నటి మమితా బైజూ నాయకిగా నటిస్తున్నారు.   ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. నికేశ్‌ ఆర్‌ఎస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న రెబల్‌ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్‌ పోస్టర్‌ను హీరో శింబు విడుదల చేశారు. 

ఈ సినిమాను 1980 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించినట్లు చిత్ర దర్శకుడు నికేష్‌ ఆర్‌ఎస్‌ తిరుపతి తెలిపారు. కాలేజీ నేపథ్యంలో సాగే రాజకీయాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. పూర్తి కమర్షియల్‌ అంశాలతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రెబల్‌ చిత్రం ఉంటుందన్నారు. ఇది జీవీ ప్రకాష్‌ కుమార్‌ సినీ కెరియర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు సినీ వర్గాలు, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. రెబల్‌ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా చెప్పారు. ఈ చిత్రంలో కరుణాస్‌, సుబ్రహ్మణ్య శివ, షాలు రహీం, వెంకటేష్‌, దీప్తీ ఆదిత్య భాస్కర్‌, కల్లూరి వినోద్‌, అదిరా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  

మరిన్ని వార్తలు