20 ఏళ్ల కెరీర్‌.. ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గానే.. త్రిష గురించి ఈ విషయాలు తెలుసా?

17 Dec, 2023 11:22 IST|Sakshi

వెండితెర మీద తిరుగులేని నటీనటులు కూడా వెబ్‌తెర మీద ఫోకస్‌ పెడుతున్నారు. ఆ జాబితాలోకి ఇప్పుడు త్రిష కూడా చేరింది. యాక్టింగ్‌ కెరీర్‌ ముఖ్యంగా నటీమణుల విషయంలో.. వయసు మీద కాదు ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుందని గ్లామర్‌ క్వీన్‌గానూ పేరుతెచ్చుకున్న ఆమెను చూస్తే తెలుస్తుంది. మధ్యలో కాస్త గ్యాప్‌ వచ్చినా ఆమె గ్రాఫ్‌ అయితే పడిపోలేదు. తన అందం, అభినయంతో ఇటు సిల్వర్‌ స్క్రీన్‌నూ అటు వెబ్‌ స్క్రీన్‌నూ మెరిపిస్తోంది! 

త్రిష సొంతూరు చెన్నై. బీబీఏ పూర్తి చేసింది.  క్రిమినల్‌ సైకాలజీ చదవాలనుకుంది.  పదహారేళ్ల వయసులో ‘మిస్‌ చెన్నై’ టైటిల్‌ గెలిచింది. ‘మిస్‌ ఇండియా’ పోటీల్లోనూ పాల్గొంది. మరెన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 

► ఇరవై ఏళ్ల క్రితం ‘జోడీ’లో నటి సిమ్రన్‌కు స్నేహితురాలిగా నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఆమే ఊహించి ఉండదు.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా స్టార్‌నవుతానని! 

► ‘మౌనం పేసియదే’ తమిళ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ‘సామి’, ‘గిల్లి’ చిత్రాలు త్రిషను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెడితే, తెలుగులో చేసిన ‘వర్షం’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలు ఆమె క్రేజ్‌ను పెంచాయి. 

► అందరిలాగే త్రిషకూ  కొంతకాలం కష్టంగానే సాగింది. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు ఆమెకు అచ్చి రాలేదు. కానీ మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మాత్రం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో త్రిషకు దొరికిన గోల్డెన్‌ చాన్స్‌గా చెప్పొచ్చు. అందులో యువరాణి కుందవైగా మెప్పించి తన ఫామ్‌ను నిలబెట్టుకుంది. 

ప్రస్తుతం వరుసగా స్టార్‌ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. ఆమె తాజా చిత్రం ‘లియో’ నెట్‌ఫ్లిక్స్‌లో, ‘ద రోడ్‌’ ఆహాలో స్ట్రీమ్‌ అవుతున్నాయి. 

విహార యాత్రలు చేయడంలో ముందుంటా. న్యూయార్క్‌ బాగా నచ్చుతుంది. ఇప్పటికే పలు దేశాలు తిరిగొచ్చాను.  ప్రపంచం మొత్తం చుట్టిరావాలన్నదే నా కోరిక. – త్రిష 

>
మరిన్ని వార్తలు