ఇక ప్రచారం తర్వాతే..!  

26 Mar, 2024 00:11 IST|Sakshi

‘విక్రమ్‌’ (2022) మూవీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత కమల్‌హాసన్‌ తదుపరి చిత్రం కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిజానికి శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌’ (భారతీయుడు)కి సీక్వెల్‌గా కమల్‌ చేసిన ‘ఇండియన్‌ 2’ ఈపాటికే విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల షూటింగ్‌లో జాప్యం జరిగింది. ఈ ఏడాది ఈ చిత్రం థియేటర్‌కి వచ్చే అవకాశం ఉంది. దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన ‘ఇండియన్‌’కి సీక్వెల్‌ కావడంతో ‘ఇండియన్‌2’పై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా కమల్‌హాసన్‌ అంగీకరించిన మరో చిత్రంపై కూడా అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అదే ‘థగ్‌ లైఫ్‌’. కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘నాయగన్‌’ (నాయకుడు) తర్వాత దాదాపు 35 ఏళ్లకు ఈ కాంబినేషన్‌ ‘థగ్‌ లైఫ్‌’తో రిపీట్‌ అవుతోంది. అయితే ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త బ్రేక్‌ పడింది. ఈ విషయం గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ – ‘‘ఇండియన్‌ 2, ఇండియన్‌ 3’ చిత్రాల షూటింగ్‌ పూర్తయింది. రెండో భాగం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత మూడో భాగం పనులు కూడా ఆరంభమవుతాయి. 

‘కల్కి 2898ఏడీ’లో గెస్ట్‌ రోల్‌ చేశాను. ఇక ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ని ఎన్నికల ప్రచారం తర్వాత మొదలుపెడతాం’’ అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకూ ‘థగ్‌ లైఫ్‌’ షూటింగ్‌ కొంత భాగం జరిగింది. ఈ మార్చిలో సెర్బియాలో షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు దర్శకుడు మణిరత్నం. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆ షెడ్యూల్‌ను వాయిదా వేశారు. ఎన్నికల ప్రచారం తర్వాతే ఈ షూటింగ్‌లో కమల్‌హాసన్‌ పాల్గొంటారు. ఈ చిత్రంలో కమల్‌ మూడు పాత్రల్లో కనిపిస్తారని టాక్‌. ఇక ‘మక్కల్‌ నీది మయమ్‌’ పేరిట 2018లో కమల్‌హాసన్‌ పొలిటికల్‌ పార్టీ ఆరంభించిన సంగతి తెలిసిందే.

Election 2024

మరిన్ని వార్తలు