మణిరత్నంకు షాక్.. భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో!

25 Mar, 2024 16:47 IST|Sakshi

ఇండియన్‌ సినిమాలో దర్శకుడిగా మణిరత్నంకు మంచి పేరు ఉంది. అలాంటి దర్శకుడి చిత్రాల్లో పనిచేయాలని కోరుకోని నటినటులు ఉండరనే చెప్పాలి. ఇటీవల మణిరత్నం భారీ తారాగణంతో దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ 1, పార్ట్‌ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా కమల్‌ హాసన్‌ హీరోగా థగ్స్‌ లైఫ్‌ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కమల్‌హాసన్‌ నటిస్తున్న 234వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా 34 ఏళ్ల తర్వాత కమలహాసన్‌, మణిరత్నం కలిసి పనిచేస్తున్న చిత్రమిదే. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అంతేకాకుండా ఈ సినిమాలో జయంరవి, దుల్కర్‌సల్మాన్‌, త్రిష కూడా ముఖ్యపాత్రలకు ఎంపికయ్యారు. కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ, మణిరత్నంకు చెందిన మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్‌ సెర్బియాలో జరగనుంది. అయితే నటుడు కమలహాసన్‌ అమెరికాలో జరుగుతున్న ఇండియన్‌–2 చిత్ర పనుల్లో బిజీగా ఉండడం, అదే సమయంలో ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల తేదీ ప్రకటించడంతో, పార్టీ వ్యవహారాలలో పాల్గొనడానికి చైన్నెకి తిరిగి వచ్చారు. 

దీంతో థగ్స్‌ లైఫ్‌ చిత్ర షూటింగ్‌ సెర్బియాలో ప్రణాళిక ప్రకారం జరగకపోవడంతో దర్శకుడు చైన్నెకి చేరుకున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కోసం‌ తదుపరి షూటింగ్‌ను ఎన్నికల తర్వాత మళ్లీ సెర్బియాకు వెళ్లి జరుపుతారని సమాచారం. దీంతో కమలహాసన్‌ కాల్‌షీట్స్‌ దొరక్కపోవడంతో ఇందులో నటిస్తున్న ఇతరుల కాల్‌షీట్స్‌ వ్యవహారంలోనూ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు కారణంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి దుల్కర్‌సల్మాన్‌ వైదొలిగారు. తాజాగా జయం రవి కూడా థగ్స్‌ లైఫ్‌ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇందులో దుల్కర్‌సల్మాన్‌ పాత్రను శింబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జయంరవికి బదులుగా దర్శకుడు మణిరత్నం ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

Election 2024

మరిన్ని వార్తలు