టైగర్‌ ష్రాఫ్‌కు స్వల్ప గాయాలు

22 Feb, 2021 16:54 IST|Sakshi

ముంబై: యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్, బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని బీటౌన్‌ కోడై కూస్తున్న విషయం తెలిసిందే. పైగా వీళ్లిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ఈ క్రమంలో తాజాగా టైగర్‌ ష్రాఫ్‌ ముంబైలో ఫుట్‌బాల్‌ ఆడుతున్న మైదానానికి దిశా పటానీ కూడా వెళ్లింది. కాసేపు ప్రియుడితో కలిసి ఫుట్‌బాల్‌ ఆడింది. ఆ తర్వాత వాళ్ల ఆటను ఎంజాయ్‌ చేస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఎంతో ఉత్సాహంగా గేమ్‌ కొనసాగుతుండగా టైగర్‌ ష్రాఫ్‌ సడన్‌గా మైదానంలో కింద పడిపోయాడు.

దీంతో మెడికల్‌ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దిశా పటానీ కూడా తన ప్రియుడికి ఏమైందోనన్న కంగారుతో పరుగు పరుగున అతడిని సమీపించి పరీక్షించింది. స్వల్ప గాయాలపాలైన టైగర్‌కు దగ్గరుండి ప్రాథమిక చికిత్స చేయించి అండగా నిలబడింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టగా టైగర్‌ ష్రాఫ్‌ సోదరి కృష్ణ ష్రాఫ్‌ దిశాకు అభినందనలు తెలుపుతూ హార్ట్‌ ఎమోజీ పెట్టింది.

ఇదిలా వుంటే దిశా పటానీ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ సరసన 'రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌'లో నటించింది. ఈ చిత్రం ఈద్‌ పండగ నాడు రిలీజ్‌ కానుంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. ఇక టైగర్‌ ష్రాఫ్‌ త్వరలో 'గణపత్‌' సినిమాలో నటించనున్నాడు. వికాస్‌ బాల్‌ డైరెక్ట్‌ చేయనున్న ఈ సినిమాలో కృతీ సనన్‌ టైగర్‌తో జోడీ కట్టనుంది.

చదవండి: Disha Patani: ఫోటోకు స్టార్‌ హీరో కామెంట్‌

మరిన్ని వార్తలు