త్వరలో మహేశ్‌బాబు నూతన గృహప్రవేశం.. త్రివిక్రమ్‌ కూడా..

19 May, 2021 00:00 IST|Sakshi

త్వరలో మహేశ్‌బాబు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చెయనున్నారట. మహేశ్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్‌ తదితరులు కూడా ఈ ఇంట్లో అడుగుపెట్టనున్నారట. ఇది సినిమా ఇల్లు అని అర్థం అయింది కదూ. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఓ పెద్ద ఇంటి సెట్‌ను వేయించాలనే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్‌. ఇంటి డిజైన్, స్పేస్‌ వగైరా వంటి అంశాల గురించి ఈ చిత్ర ఆర్ట్‌డైరెక్టర్‌తో త్రివిక్రమ్‌ చర్చిస్తున్నారట.

అన్నీ సవ్యంగా జరిగి కరోనా పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ ఇంటి సెట్లో చిత్రీకరణ ఆరంభం అవుతుందని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కీలక పాత్రలకు సుమంత్, శిల్పా శెట్టిల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి... వీరిలో ఎవరు నటిస్తారు? అనేది చూడాలి. మరోవైపు మహేశ్‌ తాజా చిత్రం ‘సర్కారువారి పాట’కి సంబంధించిన అప్‌డేట్‌ ఈ నెల 31 (మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌ డే సందర్భంగా)న వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రోజు మహేశ్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలవుతుందని సమాచారం. 

మరిన్ని వార్తలు