తెలుగు రాష్ట్రాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు హాట్ టాపిక్గా మారాయి. మా అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ నేడు(శుక్రవారం) తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. 'మా' అసోసియేషన్ను ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రకాశ్రాజ్ ముందుకు వచ్చారన్నాడు. లోకల్, నాన్లోకల్ అనేది అర్ధరహిత వాదనగా కొట్టిపారేశాడు. 'మా' సభ్యుడు ఎవరైనా ఇక్కడ పోటీ చేయొచ్చని స్పష్టం చేశాడు. ప్రకాశ్రాజ్కు అందరం మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నామని తెలిపాడు.
బండ్ల గణేశ్ మాట్లాడుతూ.. "23 సంవత్సరాల నుంచి ప్రకాశ్ రాజ్ నాకు ఆప్తులు. కష్టాల్లో ఉండే చాలామంది మొట్టమొదట ఈయనకే ఫోన్ చేస్తారు. అంతేకాదు, ఈయన ఎంతోమంది కళాకారుల పిల్లల పెళ్లిళ్లకు లక్షలు పంపిచడం నా కళ్లారా చూశాను. అంతటి మంచివ్యక్తి ఈయన. ప్రకాశ్ రాజ్ లోకల్, నాన్ లోకల్ అనడం కరెక్ట్ కాదు. మేమందం 'మా' మనుషులం. ఆయన చేసిన అద్భుతాలను చూశాను కాబట్టి 'మా'లో కూడా ఆయన అధ్యక్షుడవుతే అందరికీ అండగా ఉంటాడు"
"ఇక్కడ పుట్టిన ప్రభాస్, రాజమౌళి పాన్ ఇండియా చిత్రాలు చేస్తుంటే ఆయన్ను మాత్రం నాన్లోకల్ అంటారేంటి? ఒకసారి షాద్నగర్ చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది? 'మా'కు అధ్యక్షుడిగా పనిచేసిన అందరి సలహాలతో ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పని చేస్తారు. మా ప్యానెల్ గెలుస్తుంది" అని ధీమాగా వ్యాఖ్యానించాడు. ఇంటర్వ్యూలకు పిలవొద్దన్న బండ్ల.. 'మైక్ వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే ఏం మాట్లాడతామో తెలీదు. అప్పుడు అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అలాంటివి మాకొద్దు. మాది చిన్న కుటుంబం.. మా వెనకాల పెద్ద పెద్దవాళ్లున్నారు' అని చెప్పుకొచ్చాడు.
చదవండి:
అప్పుడు ఎందుకు నాన్ లోకల్ గుర్తురాలేదు: ప్రకాశ్ రాజ్
MAA Elections 2021: మాలో మాకు పడదా?