Chiranjeevi: రెమ్యునరేషన్‌ భారీగా పెంచేసిన చిరంజీవి, ఒక్కో సినిమాకి ఎంతంటే..

2 Feb, 2023 13:45 IST|Sakshi

చాలా కాలం తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. అంతకు ముందు నటించిన చిత్రాలలో ఆచార్య బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తాపడగా.. గాడ్‌ఫాదర్‌ మంచి టాక్‌ సంపాదించుకున్నప్పటికీ బ్రేక్‌ ఈవెన్‌ మాత్రం సాధించలేదు. అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య మాత్రం భారీ విజయాన్ని సాధించింది.

రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు  రూ.250 కోట్లపై పైగా వసూళ్లను సాధించి మెగాస్టార్‌ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది.

బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో చిరంజీవి తన రెమ్యునరేషన్‌ అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. పలు వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. వాల్తేరు వీరయ్య సినిమా కోసం రూ.50 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట చిరంజీవి.

అలాగే ప్రస్తుతం నటిస్తున్న బోళా శంకర్‌ చిత్రానికి కూడా అంతే పారితోషికం అందుకున్నాడట. కానీ ఈ చిత్రం తర్వాత నటించబోయే సినిమాలకు మాత్రం రూ.100 కోట్లు రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తున్నారట. తన మార్కెట్‌కు తగ్గట్టుగా పారితోషికం తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నాడట. బోళా శంకర్‌ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు