ఇన్నాళ్లకు మళ్లీ కన్నీళ్లు వచ్చాయి – ‘దిల్‌’ రాజు

13 Jan, 2023 10:33 IST|Sakshi

‘‘వారిసు’ చిత్రంపై తమిళ ప్రేక్షకులు చూపిన స్పందనకి వంశీ పైడిపల్లి, తమన్‌ ఏడ్చారు. ‘బొమ్మరిల్లు’ సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన ఒక ఫోన్‌ కాల్‌తో నేను కూడా ఏడ్చాను.. మళ్లీ ఇన్నాళ్లకు ‘వారిసు’ చూస్తున్నపుడు కన్నీళ్లు వచ్చాయి. మా నమ్మకం నిజం కావడంతో వచ్చిన ఆనందభాష్పాలు అవి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. దళపతి విజయ్, రష్మికా మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘వారిసు’ (తమిళ్‌).

‘వారసుడు’ (తెలుగు). ‘దిల్‌’ రాజు, శిరీష్, పరమ్‌ వి. పొట్లూరి, పెరల్‌ వి. పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తమిళ్‌లో విడుదలైంది. తెలుగులో 14న ‘వారసుడు’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ‘దిల్‌’ రాజు మాట్లడుతూ– ‘‘చెన్నైలో ‘వారిసు’ ఆడుతున్న థియేటర్‌కి వెళ్లాను.. క్లైమాక్స్‌ పూర్తయ్యాక వంశీని అభిమానంతో హత్తుకున్నాను. ప్రేక్షకులు నిలబడి క్లాప్స్‌ కొట్టడంతో మేం పడ్డ కష్టాలు మర్చిపోయాం’’ అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఒక మంచి కథని చెబితే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో ‘వారిసు’ మరోసారి నిరూపించింది. సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. అల్లు అరవింద్‌గారు ఫోన్చే‌సి ‘వెయ్యి కోట్లు పెట్టినా రాని అనుభూతి ఇది’ అని అభినందించారు’’ అన్నారు. ‘‘తమిళంలోలా తెలుగులోనూ ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు నటి జయసుధ.

మరిన్ని వార్తలు