ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రముఖ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్ 17కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు పేరులో చిన్న మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం RCB తమ జట్టు పేరును ఇంగ్లీషులో (Royal Challengers Bangalore) అని రాస్తోంది. ఇకపై (Royal Challengers Bengaluru) అని మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే విషయాన్ని చెబుతూ ఇప్పటికే పలు వీడియోలను RCB విడుదల చేసింది.
తాజాగా రష్మిక మందన్న కూడా ఆర్సీబీ కోసం ఒక ప్రోమోను విడుదల చేసింది. అందులో రష్మిక మందన్న మేకప్ వ్యాన్ లోపలికి వెళ్తుంది. ఆ వ్యాన్ లోపల అద్దంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని రాసి ఉంది. అది చూసిన రష్మిక రాయల్ ఛాలెంజర్స్ను మాత్రమే ఉంచి బెంగళూరు అనే పదాన్ని తుడిచిపెట్టేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియో ఒకటి రిషబ్ శెట్టి కూడా గతంలో విడుదల చేశారు.
16 ఏళ్లుగా జట్టు పేరు మార్చాలని అక్కడి స్థానికులు ఆర్సీబీని కోరుతున్నారు. స్థానిక అభిమానుల కోరికమేరకు ఆర్సీబీ ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 19న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మార్చి 22న CSK, RCB మధ్య జరిగే మ్యాచ్తో ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది.