కల నెరవేర్చుకున్న మెగా హీరో.. నెక్స్ట్‌ టార్గెట్‌ చిరంజీవేనట!

9 Mar, 2024 08:44 IST|Sakshi

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ పేరు మార్చుకున్నాడు. తన తల్లి దుర్గ పేరును తీసుకుని సాయిదుర్గ తేజ్‌గా సరికొత్తగా నామకరణం చేసుకున్నాడు. అమ్మ ఎప్పటికీ తనతో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే తల్లి పేరు మీదట ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించాలన్న కలను సైతం నెరవేర్చుకున్నాడు. దుర్గ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ బ్యానర్‌ ద్వారానే సోల్‌ ఆఫ్‌ సత్య షార్ట్‌ ఫిలిం తెరకెక్కిందని పేర్కొన్నాడు.

నెక్స్ట్‌ టార్గెట్‌ చిరంజీవే
మార్చి 8న ఉమెన్స్‌ డే (మహిళా దినోత్సవం) సందర్భంగా సోల్‌ ఆఫ్‌ సత్య ప్రత్యేక ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ వేదికపైనే తన పేరు మార్పును వెల్లడించాడు. రామ్‌చరణ్‌తో మల్టీస్టారర్‌ సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చా? అన్న ప్రశ్నకు.. మొన్నే పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేశాను. అంతకుముందు నాగబాబుగారితో చేశాను. నా నెక్స్ట్‌ టార్గెట్‌ చిరంజీవిగారే! మా చిరుమామతో సినిమా చేశాకే మిగతావాళ్లతో మల్టీస్టారర్‌ చేస్తాను అని తేజ్‌ చెప్పుకొచ్చాడు.

వెబ్‌సైట్‌లో రాస్తేనే తెలిసింది
గాంజా శంకర్‌ సినిమా ఉందా? ఆగిపోయిందా? అన్న ప్రశ్నకు.. 'సినిమా ఆగిపోయిందని ఓ వెబ్‌సైట్‌లో వార్త చూశాకే నాకూ తెలిసింది. మూవీ ఉందా? లేదా? అన్న విషయం ఆ వెబ్‌సైట్స్‌ చెప్తే కానీ తెలియదు' అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. సాయిధరమ్‌ తేజ్‌, కలర్స్‌ స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్‌ ఫిలిం సత్య. సీనియర్‌ నటుడు నరేశ్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ ఫిలిం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.

చదవండి: ఓటీటీకి హనుమాన్.. తొలిసారి అలాంటి షాకింగ్‌ నిర్ణయం!

Election 2024

మరిన్ని వార్తలు