Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్‌లో ప్రమాదం.. సంజయ్‌ దత్‌కు గాయాలు!

14 Aug, 2023 18:49 IST|Sakshi

టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇ‍స్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్రంలో రామ్‌ సరసన బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్‌ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్‌ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్‌ హీరోయిన్‌)

అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్‌లో సంజయ్ దత్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్‌ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. అతని తలకు గాయం కాగా..  రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపింది. అయినప్పటికీ అతను వెంటనే సెట్‌కి తిరిగి వచ్చి షూటింగ్‌ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ముంబయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో కొనసాగుతోంది. కాగా.. సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రంలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

కాగా.. జూలైలో మేకర్స్ సంజయ్ దత్ పాత్రను 'బిగ్ బుల్'గా అభిమానులకు పరిచయం చేశారు.  అతని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా  ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో  భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు.

(ఇది చదవండి: తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్‌ చేస్తానంటున్న డైరెక్టర్‌)

మరిన్ని వార్తలు