Shruti Haasan: ఆడియో డ్రామాకు  శృతి గొంతు

2 Oct, 2022 09:18 IST|Sakshi

హీరోయిన్‌ శృతిహాసన్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొనవచ్చు. సంగీత దర్శకురాలిగా సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కథానాయికగా, గాయనీగా తనలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం నటనలో బిజీగా ఉన్న శృతిహాసన్‌ మరో కొత్త శాఖలోకి తనను పరిచయం చేసుకున్నారు. ఆడియో డ్రామాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆడియో డ్రామాల తరువాతే సినిమాలు ప్రజల మధ్యకు వచ్చాయి. అయితే ఈ ఆడియో డ్రామాలు అనేవి హాలీవుడ్‌లో ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి.

అలా తాజాగా రూపొందిన ది సౌండ్‌ మాన్‌ యాక్ట్‌ అనే ఆడియో డ్రామా సిరీస్‌లోని గ్రామీణ పనిమనిషి పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. దర్శకుడు నైల్‌ గ్యామన్‌ దర్శకత్వంలో డీసీ సంస్థ ఇంతకు ముందు నిర్మించిన అంతర్జాతీయ సిరీస్‌ ది సౌండ్‌ మాన్‌.ఈ సిరీస్‌కు విశేషాదరణ లభించడంతో తాజాగా మూడో సిరీస్‌ వరల్డ్‌ ఎండ్‌ ఇన్‌ పేరుతో రూపొందించారు. దీనికి డబ్బింగ్‌ చెప్పడం గురించి నటి శృతిహాసన్‌ పేర్కొంటూ సంగీత కళాకారునిగా జీవితాన్ని ప్రారంభించిన తనకు ది సౌండ్‌ మాన్‌ ఆడియో డ్రామాకు డబ్బింగ్‌ చెప్పాలన్నది చిరకాల కల అని అన్నారు. అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు.

దర్శకుడు నైల్‌ గ్యామన్‌కు తాను పెద్ద ప్యాన్‌ అని అన్నారు. కాగా సౌండ్‌ మాన్‌ మూడో సిరీస్‌లో తాను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. దీని నిర్మాత ఈ ఆడియో డ్రామాలు పలు రకాల ప్లాట్‌ఫామ్‌లకు తీసుకెళుతున్నారని చెప్పారు. కాగా నటి శృతిహాసన్‌ ఇంతకు ముందు ట్రెండ్‌ స్టోన్, ప్రోజెన్‌–2 సీరియల్స్‌ డబ్బింగ్‌ చెప్పడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఈమె ప్రభాస్‌తో జంటగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌ చిత్రంతో పాటు బాలకృష్ణ 107వ చిత్రంలోనూ, చిరంజీవి 154వ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా వున్నారు.  

మరిన్ని వార్తలు