Sivakarthikeyan: ఫోన్‌ చేసి మరీ మెచ్చుకున్న రజనీ.. సంతోషంలో హీరో

10 Aug, 2023 18:13 IST|Sakshi

కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం మావీరన్‌. హీరోయిన్‌ అదితి శంకర్‌ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్‌ మడోన్‌ దర్శకత్వంలో శాంతి పిక్చర్స్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మించారు. ఈ చిత్రం విడుదలై 25 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా శివకార్తికేయన్‌ బుధవారం ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో మావీరన్‌ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

జైలర్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ, చిత్ర విడుదల కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన మావీరన్‌ చిత్రాన్ని చూడలేకపోతారేమోనని చాలా నిరుత్సాహపడ్డానన్నారు. అయితే ఇటీవల మావీరన్‌ చిత్రాన్ని చూసిన రజనీకాంత్‌.. తనకు ఫోన్‌ చేసి చిత్రం చాలా బాగుందని అభినందించారన్నారు. ఇది తనతో పాటు యూనిట్‌ సభ్యులందరికీ ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పారు. మావీరన్‌ సినిమాను పూర్తిగా ఎంజాయ్‌ చేశానని, చాలా గ్రాండ్‌గా, సూపర్బ్‌గా ఉందని రజనీ ప్రశంసించారన్నారు.

చాలా డిఫరెంట్‌ కథా చిత్రాలను ఎంచుకుంటున్నావు కదా అని అభినందించారన్నారు. ఈ సందర్భంగా ఒక అభిమానిగా రజనీకాంత్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే తానీ రంగంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. కాగా ఈయన ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతున్న తన 21వ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిసింది.

చదవండి: స్నేహ చేసిన పనికి కంగారుపడుతున్న ఫ్యాన్స్‌.. అలాంటివి చేయొద్దని విజ్ఞప్తి

మరిన్ని వార్తలు