South Indian Actress: ఆ రెండు చిత్రాలతో స్టార్ హీరోయిన్స్ సక్సెస్.. పోటీలో నిలబడతారా?

13 Dec, 2023 13:01 IST|Sakshi

గత కొన్నేళ్లుగా దక్షిణాది చిత్రాలు విజయాల సంఖ్య బాగానే పెరిగిందనే చెప్పాలి. కొన్ని భారీ చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టి చిత్ర పరిశ్రమ మనుగడకు అండగా నిలిచాయి. ముఖ్యంగా దక్షిణాది సినీతారలు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ విశేషం. కోలీవుడ్‌ యువ దర్శకుడు అట్లీ తొలిసారిగా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్‌ సంచలన విజయాన్ని సాధించింది.

ఈ చిత్రం ద్వారా దక్షిణాది లేడీస్‌ సూపర్‌స్టార్‌ నయనతార బాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. దర్శకుడు అట్లీ, నటి నయనతార, నటుడు విజయ్‌ సేతుపతికి అక్కడ జవాన్‌ చిత్రం మైల్‌స్టోన్‌గా మిగిలింది. అంతకు ముందు వరకు దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు పాన్‌ ఇండియా కథానాయకిగా తన స్థాయిని విస్తరించుకున్నారు. 

మరోవైపు డిసెంబర్‌ 1 విడుదలైన యానిమల్‌ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించగా.. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. అయితే సందీప్‌కు హిందీలో ఇదే తొలి చిత్రం కాగా.. నటి రష్మికకు మూడవ చిత్రం కావడం గమనార్హం. ఈమె ఇంతకు ముందే నటించిన గుడ్‌ బై, మిషన్‌ మజ్ను చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. 

అయినా నటి రష్మిక మందన్నకు నటిగా మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇక్కడ విజయమే కొలమానం కాబట్టి యానిమల్‌ చిత్ర విజయం ఈమెకు చాలా కీలకంగా మారింది. కాగా ఈ చిత్ర విషయం రష్మికలో నూతనోత్సాహం వచ్చిందనే చెప్పాలి. గతంలో వహిదా రెహమాన్‌, హేమమాలిని, శ్రీదేవి వంటి నటీమణులు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా రాణించారు. 

ఇటీవల నటి దీపికా పదుకొణె లాంటి బాలీవుడ్ తారలు టాప్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నా ఆ స్థాయిలో పేరు రాలేదు. కాగా ఈ ఏడాది విడుదలైన దక్షిణాది హీరోయిన్లు నటించిన రెండు హిందీ చిత్రాలు సంచలన విజయాలను సాధించడంతో రష్మిక, నయనతారలు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. అలాగని ఈ ఇద్దరికి హిందీలో కొత్తగా అవకాశాలేమీ రాలేదు. రష్మిక తెలుగులో, నయనతార తమిళంలో వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు.

>
మరిన్ని వార్తలు