జనం మెచ్చే సినిమాలు చేస్తా: సత్యదేవ్‌

2 Aug, 2021 09:08 IST|Sakshi

ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది

తిరుపతికి చేరిన విజయోత్సవ యాత్ర

తిరుపతి కల్చరల్‌: తిమ్మరుసు చిత్రం విజయవంతం అయిన సందర్భంగా విజయోత్సవయాత్రలో భా గంగా  ఆదివారం ఆ చిత్రం యూనిట్‌ తిరుపతిలో సందడి చేసింది. ఈ చిత్రం ప్రదర్శిస్తున్న పీజీఆర్‌ సినిమాస్‌కు విచ్చేసిన తిమ్మరుసు చిత్రం హీరో సత్యదేవ్, దర్శకుడు చరణ్‌ కొప్పిశెట్టి, నిర్మాత మహేష్‌ కోనేరు, సహనటుడు అకింత్‌కు పీజీఆర్‌ అధినేత అభిషేక్‌ పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం వారు ప్రేక్షకులతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించి, ప్రేక్షకుల నడుమ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ.. కరోనా విపత్కర కష్టాల నేపథ్యంలో విడుదలైన తమ చిత్రాన్ని ఆదరిస్తూ విజయపథంలో నడిపిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. తిరుమల వెంకన్న పాదాల చెంతనున్న తిరుపతి అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి నుంచే తన విజయయాత్ర ప్రారంభించడం మహదానందమని చెప్పారు. ఈ చిత్రం తర్వాత ‘స్కైలాబ్‌’ చిత్రంలో నటిస్తున్నానని, భవిషత్తులో జనం మెచ్చే మంచి చిత్రాలతో ముందుకు సాగుతాయనని తెలిపారు. దర్శకుడు చరణ్‌ కొప్పిశెట్టి మాట్లాడుతూ చిత్రం యూనిట్‌ సమష్టి కృషితో ఒక మంచి చిత్రాన్ని అందించామని చెప్పారు. కరోనా రెండోదశ తర్వాత ఎంతో నమ్మకంతో చిత్రా న్ని విడుదల చేశామని, అదే నమ్మకంతో సినిమాకు విజయాన్ని చేకూర్చుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. అనంతరం హీరో సత్యదేవ్‌తో సెల్పీ దిగేందుకు అభిమానుల సందడిచేశారు.

మరిన్ని వార్తలు