ఓటు హక్కుపై విజయ్‌ సంచలన వ్యాఖ్యలు

10 Oct, 2020 17:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘పెళ్లి చూపులు’ సినిమాతో  టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక  ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. యువత ఫాలోయింగ్‌ అందులోనూ అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడే హీరోల లిస్ట్‌లో అతడు‌ మొదటి స్థానంలో ఉంటాడు. తన డ్రెస్సింగ్‌, మాట్లాడే విధానం, ఆటిట్యూడ్‌కి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు.  ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫైటర్’ చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే విజయ్‌కు జంటగా నటిస్తున్నారు. చదవండి: యూర‌ప్ వీధుల్లో ‘అర్జున్‌రెడ్డి’

తాజాగా ఈ హీరో.. ప్రజాస్వామ్యం, ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్, అనుపమ చోప్రాలతో జరిగిన చిట్‌చాట్‌లో రాబోయే రోజుల్లో ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా? అని విజయ్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విజయ్.. ప్రజాస్వామ్యంలో ఓటింగ్‌ విధానంపై విముఖత వ్యక్తం చేశారు. డబ్బులు, మందు కోసం ఓటును అమ్ముకునే వారికి ఓటు హక్కు తీసేయాలని అన్నారు. తన ఓటు విలువేంటో తెలియని వాళ్లకు ఓటు హక్కు ఎందుకని విజయ్ అభిప్రాయపడ్డాడు. అలాగే బాగా డబ్బున్న ధనవంతులకు కూడా ఓటు హక్కు వద్దని, చదువుకుని ఓటు హక్కు విలువ తెలిసిన మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని పేర్కొన్నాడు. కాగా విజయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవ్వడంతో నెటిజన్లు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. కొంతమంది విజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు అతడి మాటలను తప్పుబడుతున్నారు. చదవండి: అనుష్క–విజయ్‌– ఓ సినిమా?

మరిన్ని వార్తలు