విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ జంటగా సినిమా..

15 Oct, 2020 12:01 IST|Sakshi

తిరువనంతపురం: తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి, హీరోయిన్‌ నిత్యామీనన్‌ జంటగా ఓ మలయాళ సినిమా రూపొందబోతుంది. ఇప్పటికే మార్కోని మథాయ్‌తో మాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విజయ్‌కు మలయాళంలో ఇది రెండో సినిమా. ఆంటో జోసెఫ్ నిర్మించనున్న ఈ చిత్రంతో వీఎస్‌ ఇందూ దర్మకురాలిగా పరిచయం కానున్నారు. అయితే గతేడాదే ఈ సినిమాకు విజయ్ సేతుపతి, నిత్యా మీనన్‌ను చిత్ర యూనిట్‌ సంప్రదించగా ఇద్దరూ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. చదవండి: త్వరలో పెళ్లి.. రూ.18 వేలే ఉన్నాయి

కోవిడ్‌ కారణంగా ప్రభుత్వ ఆంక్షలకు లోబడి తక్కువ సిబ్బందితో కేరళలో ముందుగా షూటింగ్‌ మొదలు పెట్టనున్నారు. ఇదిలా ఉండగా ఇందూ వీఎస్ ఇంతకుముందు జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్ర నిర్మాత సలీం అహ్మద్‌తో కలిసి కుంజనంతంతే కడా, అమీంటే మకాన్ అబూ, పతేమారి వంటి చిత్రాల్లో పనిచేశారు. ఇది ఆమెకు మొదటి మలయాళ చిత్రం కానుంది. అదే విధంగా విజయ్ నటించిన హిట్‌ మూవీ ‘96’కు సంగీతం సమకూర్చిన గోవింద్ వసంత ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు. మనీష్ మాధవన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. చదవండి: వివాదంలో విజయ్‌ సేతుపతి చిత్రం

ప్రస్తుతం విజయ్‌ సేతుపతి శ్రీలంక క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 800 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సేతుపతిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #షేమ్‌ఆన్‌ విజయ్‌సేతుపతి అంటూ ట్విటర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. జాతి ఆధారంగా వివక్ష చూపించే దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్‌ పాత్రలో మీరు నటిస్తారా అని, ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిత్యామీనన్‌ కోలాంబి అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అరుంధతి దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: కరోనా జీవితం పోరాటంగా మారింది

మరిన్ని వార్తలు