కేరళలో కోవిడ్‌ వేరియంట్‌

18 Dec, 2023 05:14 IST|Sakshi

పత్తనంతిట్ట: కేరళలో కోవిడ్‌–19 సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసు బయటపడింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి ఆదివారం ప్రకటించారు. అయితే, దీనితో ఎలాంటి ఆందోళనా అవసరం లేదని స్పష్టం చేశారు. ‘కొన్ని నెలల క్రితం సింగపూర్‌ ఎయిర్‌పోర్టులో భారతీయ ప్రయాణికుల స్క్రీనింగ్‌ సందర్భంగా ఈ సబ్‌ వేరియంట్‌ను గుర్తించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ కొత్త వేరియెంట్లను గుర్తించారు.

తాజాగా, జేఎన్‌.1 ఉప వేరియెంట్‌ తిరువనంతపురం కరకుళంలో బయటపడింది. దీనితో కంగారు పడాల్సిన పనిలేదు’అని మంత్రి అన్నారు. అయితే, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్‌ )సాధారణ పరీక్షల్లో భాగంగా ఒక శాంపిల్‌లో ఈ వేరియంట్‌ను నవంబర్‌ 18న గుర్తించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి పేర్కొంది. 79 ఏళ్ల బాధిత మహిళ ఇన్‌ప్లూయెంజా వంటి తేలికపాటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారని వివరించింది.

>
మరిన్ని వార్తలు