‘కోవిడ్‌-19 నుంచి కోలుకోగానే అరెస్ట్‌’

2 Aug, 2020 19:04 IST|Sakshi

నిర్లక్ష్యంపై పోలీసుల సీరియస్‌

సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో నడిరోడ్డుపై పీపీఈ కిట్‌ విసిరివేసిన వ్యక్తిని కరోనా వైరస్‌ అనుమానితుడిగా పోలీసులు గుర్తించారు. ఎపిడెమిక్‌ చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశామని, వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా గుమికూడే సీఆర్‌ పార్క్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి పీపీఈ కిట్‌ను రోడ్డుపై పడవేసే వీడియోను బాలీవుడ్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ శంతను మిత్రా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం కలకలం రేపింది. కల్కాజీ ఎమ్మెల్యే అతిషి మర్లేనాకు ఈ వీడియోను మిత్రా ట్యాగ్‌ చేశారు.

పీపీఈ కిట్‌ను నిర్లక్ష్యంగా రోడ్డుపై పడవేస్తున్న వీడియోపై స్పందించిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కరోనా వైరస్‌ పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నాడని, మహమ్మారి నుంచి కోలుకోగానే అతడిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు వెల్లడించారు.  ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయని ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ తెలిపారు. రోజూ వారి  క‌రోనా కేసుల విష‌యంలో మిగ‌తా  రాష్ర్టాల‌తో పోలిస్తే ఢిల్లీ 12వ స్థానానికి ప‌డిపోయిందని పేర్కొన్నారు. గ‌డిచిన 21 రోజుల్లో దేశ వ్యాప్తంగా కోవిడ్ విజృంభ‌ణ కొన‌సాగుతుండ‌గా ఢిల్లీలో త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని మంత్రి వివరించారు. చదవండి : పెట్రో సెగలు : ఢిల్లీ కేబినెట్‌ కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు