గుజరాత్‌ లో వైరస్‌ వ్యాప్తి మళ్లీ షురు

18 Mar, 2021 12:45 IST|Sakshi

మార్చి 17న 1000 కేసుల దాటిన గుజరాత్‌ 

కేసులున్న ప్రాంతాలలో  పలు సేవలకు ఆంక్షలు 

అహ్మదాబాద్ : భారత్‌లో కరోనా మహమ్మారి వైరస్‌ విజృంభించి ఏడాది గడుస్తున్నా కోవిడ్‌ నుంచి ఇంకా ప్రజలు పూర్తి ఉపశమనం దొరకడం లేదు. ఒకవైపు వ్యాక్సిన్‌ వచ్చినా కోవిడ్‌ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఒకానొక దశలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా గత కొన్నికాలంగా మళ్లి తన ప్రతాపాన్నిచూపిస్తోంది. దీనిలో భాగంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూలు విధిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే పనిలో భాగంగా గుజరాత్‌ ప్రభుత్వం అహ్మదాబాద్ మున్సిపల్ సంస్ధ నడుపుతున్న బస్సులను గురువారం నుంచి తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు నిలిపివేసింది. గత మూడు నెలల్లో మొదటిసారిగా గుజరాత్‌లో మార్చి 17న  కేసులు 1000 మార్కును దాటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,122 కరోనావైరస్ కేసులుగా నమోదయ్యాయి.

నగరంలో రాత్రి పూట కర్ఫ్యూ
నగరంలోని వైరస్‌ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఎనిమిది  వార్డులలోని రెస్టారెంట్లు, మాల్స్‌ను, షో రూములు, టీ స్టాల్స్, బట్టల దుకాణాలు, పాన్ పార్లర్స్, హెయిర్ సెలూన్లు, స్పా, జిమ్స్ లను రాత్రి 10  తరువాత మూసివేయాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మార్చి 15 న ఉత్తర్వులు జారీ చేసింది.  వీటితో పాటు అహ్మదాబాద్, సూరత్, వడోదర మరియు రాజకోట్‌ ప్రాంతాలలో రాత్రి కర్ఫ్యూ విధించింది. మార్చి 31 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. వీటితో పాటు నివారణ చర్యల్లో భాగంగా జంతు ప్రదర్శనశాలతో సహా అన్ని తోటలు, ఉద్యానవనాలు ఈ రోజు నుండి తదుపరి ఆదేశాల వరకు మూసివేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం, కోవిడ్‌-19 బారిన పడి అహ్మదాబాద్ లో 2,269 మరణాలు నమోదు అయ్యియి. వైరస్‌ నుంచి 58,043 మంది కోలుకుంటున్నారు, రికవరీ రేటు 95.3 శాతంగా ఉంది. 

వైరస్‌ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం
దేశంలో కరోనా సమస్యపై ప్రధాని బుధవారం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. సమావేశం తరువాత, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రోజువారీ పరీక్షలు, టీకాల సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో మహమ్మారి పరిస్థితిని సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని  ఏర్పాటు చేశామని  అందుకు  రూపానీనే స్వయంగా నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు