West Bengal: టీఎంసీలో వర్గపోరు.. కీలక నేత రాజీనామా?

2 Mar, 2024 07:24 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)లో కీలక నేత కునాల్ ఘోష్ రాజీనామా చేశారు. కునాల్‌కు అదే పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ మధ్య  గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. దాని పరిణామం ఇప్పుడు బయటపడింది. 

మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో మమతా బెనర్జీ మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సన్నాహాలు చేసేందుకు సుదీప్ ఇటీవల కోల్‌కతాలో టీఎంసీ నేతలతో సమావేశమయ్యారు. అయితే దీనికి ఆయన కునాల్ ఘోష్‌ను ఆహ్వానించలేదు. దీంతో కునాల్ ఘోష్.. సుదీప్‌ పేరు ప్రస్తవించకుండా ట్విట్టర్‌లో ఆయనపై విమర్శల దాడి చేసారు. ‘ఆ నేత అసమర్థుడు. గ్రూపులను నడిపే నేత, స్వార్థపరుడు. ఏడాది పొడుగునా చిల్లర రాజకీయాలు చేసి, ఎన్నికలకు ముందు ‘దీదీ అభిషేకం’ పేరుతో, పార్టీ కార్యకర్తల సహకారంతో ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. మరెలాంటి ప్రయోజనం ఉండదు’ అని పేర్కొన్నారు.

2017లో రోజ్ వ్యాలీ యజమాని నుంచి రూ.27 లక్షలు తీసుకున్న ఆరోపణలపై సీబీఐ సుదీప్‌ను అరెస్ట్ చేసి భువనేశ్వర్ జైలుకు పంపింది. నెలరోజుల పాటు జైలులో ఉన్నాక అతనికి బెయిల్‌ వచ్చింది. 2018లో జరిగిన ఈ కుంభకోణంలో ఈడీ రూ.130 కోట్లను స్వాధీనం చేసుకుని, సుదీప్‌ను విచారించింది.  కాగా కునాల్‌ ఘోష్‌ తన రాజీనామాకు ముందే తన ట్విట్టర్ ప్రొఫైల్ నుండి టీఎంసీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ తదితర పోస్ట్‌లను తొలగించి, జర్నలిస్టు, సామాజిక కార్యకర్త అని రాశారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు