BJP: వివాదాస్పదులకు మొండిచేయి

26 Mar, 2024 05:45 IST|Sakshi

టికెట్ల కేటాయింపులో బీజేపీ కఠిన వైఖరి

ప్రజ్ఞా, బిదురి, హెగ్డే తదితరులకు నో చాన్స్‌

నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలకు బాగా తెలిసొస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంతంగా 370, ఎన్డీఏకు 400 పై చిలుకు లోక్‌సభ స్థానాలను కమలనాథులు లక్ష్యంగా పెట్టుకోవడం తెలిసిందే. ఆ క్రమంలో ప్రతి లోక్‌సభ స్థానాన్నీ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ‘టార్గెట్‌ 400’ లక్ష్యసాధనకు అడ్డొస్తారనుకుంటే సొంత పార్టీ నేతలను కూడా క్షమించడం లేదు. ఆ క్రమంలో ఎంతటి సీనియర్లనైనా సరే, సింపుల్‌గా పక్కన పెట్టేస్తోంది. దాని ఫలితమే... వివాదాస్పదులుగా పేరుబడ్డ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్, రమేశ్‌ బిదురి, అనంత్‌కుమార్‌ హెగ్డే వంటి సిట్టింగ్‌ ఎంపీలకు ఈసారి టికెట్ల నిరాకరణ!

  రమేశ్‌ బిదురి
ఈ సౌత్‌ ఢిల్లీ సిట్టింగ్‌ ఎంపీ ఏకంగా పార్లమెంటులోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. నిండు సభలో బీఎస్పీ ఎంపీ డానిష్‌ అలీని బిదురి అసభ్య పదజాలంతో దూషించడం పెను దుమారానికి దారి తీసింది. ఆయన్నూ సస్పెండ్‌ చేయాల్సిందేనంటూ విపక్షాలు హోరెత్తించాయి. దాంతో రెండుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన బిదురికి టికెట్‌ నిరాకరించింది.

అనంత్‌కుమార్‌ హెగ్డే
కర్ణాటకలో సీనియర్‌ బీజేపీ నేత. ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడు. కేంద్ర మంత్రిగానూ చేశారు. రాజ్యాంగంలో చాలా అంశాలను మార్చాల్సి ఉందని, అందుకు బీజేపీకి ప్రజలు 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. విపక్షాలన్నీ వాటిని అందిపుచ్చుకుని బీజేపీని దుయ్యబట్టాయి. హెగ్డే వ్యాఖ్యలతో పారీ్టకి సంబంధం లేదని బీజేపీ వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. దాంతో ఆయన నాలుగుసార్లు వరుసగా నెగ్గిన ఉత్తర కన్నడ స్థానాన్ని మాజీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డేకు కేటాయించింది.

పర్వేష్‌ సాహిబ్‌సింగ్‌
ముస్లిం చిరు వ్యాపారులను పూర్తిగా బాయ్‌కాట్‌ చేయాలంటూ ఏకంగా ఢిల్లీలోనే బహిరంగ సభలో పిలుపునిచ్చి కాక రేపారు. సభికులతోనూ నినాదాలు చేయించారు. దాంతో పశి్చమ ఢిల్లీ సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ ఆయనకు కూడా ఈసారి టికెట్‌ గల్లంతైంది. వీరేగాక ఇతరేతర కారణాలతో ఈసారి చాలామంది సీనియర్లు, సిట్టింగ్‌ ఎంపీలకు బీజేపీ టికెట్లు నిరాకరించింది.

ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్‌ను 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 3.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో మట్టికరిపించిన చరిత్ర ఆమెది. . కాకపోతే మంటలు రేపే మాటలకు సాధ్వి పెట్టింది పేరు. నాథూరాం గాడ్సేను దేశభక్తునిగా అభివరి్ణంచినా, ముంబై ఉగ్ర దాడు ల్లో అమరుడైన పోలీసు అధికారి హేమంత్‌ కర్కరేకు తన శాపమే తగిలిందంటూ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి ఈసీ నుంచి షోకాజ్‌ నోటీసు అందుకున్నా ఆమెకే చెల్లింది. 195 మందితో బీజేపీ విడుదల చేసిన తొలి విడత జాబితాలో ప్రజ్ఞకు మొండిచేయి చూపారు. తాను పలు సందర్భాల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణమని ఆమే స్వయంగా అభిప్రాయపడ్డారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Election 2024

మరిన్ని వార్తలు