ఇలా చేస్తే 2 లక్షల మరణాలు నివారించవచ్చు..

1 Sep, 2020 19:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ని తుదముట్టించే వ్యాక్సిన్‌ ఏది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో సామాజిక దూరం, మాస్క్‌ ధరించడం వంటివి పాటిస్తే.. వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చనే సంగతి అనుభవపూర్వకంగా తెలిసి వస్తోంది. ఈ క్రమంలో అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్‌ఎంఈ) నిర్వహించిన మోడలింగ్‌ అధ్యాయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి కఠినంగా పాటిస్తే.. 2020 డిసెంబరు నాటికి భారతదేశంలో రెండు లక్షల కరోనా మరణాలను నివారించవచ్చని తెలిపింది. కేసుల సంఖ్యను కూడా బాగా తగ్గించవచ్చని అధ్యాయనం వెల్లడించింది. అంతేకాక భారత్‌ లాంటి అధిక జనాభా కల దేశంలో మహమ్మారి విజృంభణ ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయలేం కాబట్టి మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి ఇండియాలో అత్యవసరమని అధ్యాయనం స్పష్టం చేసింది. (చదవండి: 69% మందికి లక్షణాల్లేవ్‌..!)

ఇప్పటికే ఢిల్లీ వంటి కొన్ని పట్టణాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి మంచి ఫలితాలిచ్చాయంది. ఈ అధ్యాయనం ప్రకారం భారతదేశంలో ఆగస్టు నాటికి కరోనా మరణాల సంఖ్య 60 వేల పై చిలుకు ఉండగా.. డిసెంబరు, 2020 నాటికి 2,91, 145 మంది కోవిడ్‌ బారిన పడి మరణిస్తారని మోడలింగ్‌ అధ్యాయనం అంచాన వేసింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 36,91,167 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 819 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 65,288 చేరింది.

మరిన్ని వార్తలు