వ్యాక్సిన్‌ డ్రైవ్‌ : ముందు వాళ్లు తీసుకుంటే..!

5 Feb, 2021 16:01 IST|Sakshi

టీకాలపై ‘లోకల్‌ సర్కిల్స్ ఆసక్తికరమైన సర్వే

రాజకీయ నాయకులు ముందుకొస్తే సిద్ధమే అంటున్న జనం

సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గత నెల ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లోకల్‌సర్కిల్స్’ సర్వే నిర్వహించింది. ఈ కొత్త అధ్యయనం ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది. కరోనా టీకా తీసుకోవడానికి ముందుకొచ్చేవారి సంఖ్య పెరిగిందనీ, అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,సినీ, క్రీడా సెలబ్రిటీలు  ముందుకొచ్చి టీకా తీసుకుంటే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.

దేశంలోని 289 జిల్లాల్లోని 25 వేలకు పైగా పౌరులతో నిర్వహించిన లోకల్‌ సర్కిల్స్‌ అధ్యయనం ప్రకారం జనవరి 16 న భారతదేశం అతిపెద్ద టీకాల డ్రైవ్‌ను ప్రారంభించిన వారాల తరువాత, భారతదేశంలో వ్యాక్సిన్ వ్యాప్తి నెలలోనే 16 శాతం తగ్గింది. టీకా సామర్థ్యం గురించి కొద్ది శాతం మందికి మాత్రమే తెలుసని, దుష్ప్రభావాల గురించి ఆందోళన చెందుతున్నారని సర్వే తేల్చింది. 

58 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటానికి ఇప్పటికీ వెనుకాడటం లేదు. అయితే ముందుగా ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ నాయకులు టీకా తీసుకుంటే తామూ టీకా తీసుకునేందుకు వెనకాడబోమని చెప్పారు. 39 శాతం మంది ప్రజలు విముఖత చూపారు. అయితే ప్రముఖులంతా ముందుకొచ్చివ్యాక్సిన్‌ తీసుకుంటే వ్యాక్సిన్‌ పట్ల సుముఖత వ్యక్తం చేసే వారి సంఖ్య ప్రస్తుతమున్న 42 శాతం నుంచి  65 శాతానికి  పెరుగుతుందని అంచనా. అలాగేకరోనా  సంకోచం స్థాయిలు 58 శాతం నుండి 35 శాతానికి పతన మవుతాయని సర్వే తెలిపింది. మూడు నెలల వరకు వేచి ఉంటామని 29 శాతం మంది చెప్పగా, 3-6 నెలలు వేచి ఉంటామని 5 శాతంమంది, 6-12 నెలలు వేచి ఉంటామని 12 శాతం, ఏడాది పాటు వెయిట్‌ చేస్తామని 5 శాతంమంది  12 నెలల కన్నా ఎక్కువ వేచి ఉండి, ఆ తరువాత నిర్ణయించు కుంటామని 5 శాతం మంది చెప్పారు. కేవలం  2 శాతం మంది పౌరులు మాత్రమే టీకా తీసుకోమని చెప్పారు.  5 శాతం ఏమీ చెప్పలేమ న్నారని  లోకల్ సర్కిల్స్ సర్వే పేర్కొంది.

బ్రాండ్ స్ట్రాటజీ నిపుణుడు, కన్సల్ట్స్ సంస్థ వ్యవస్థాపకుడు హరీష్ బిజూర్ ప్రకారం, పోలియో లాంటి మాస్ టీకాల సమయంలో  ప్రజల మనసుల్లో భద్రత, సమర్థతకు సంబంధించిన, ఆందోళనలు సందేహాలుంటాయని. టీకాల డ్రైవ్‌ను సమర్థవంతంగా అమలు  చేసేందుకు దేశంలోని  ప్రముఖ రాజకీయ నేతలు (కేంద్రం, ముఖ్యమంత్రులు, క్యాబినెట్ మంత్రులు) తీసుకోవాలన్నారు. అంతేకాదు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు టీకా తీసుకోవడంతోపాటు అనుభవాలను పంచుకోవడం ద్వారా ప్రజల్లో భయాలను పోగొట్టి,  విశ్వాసాన్ని పెంపొందించ వచ్చన్నారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, క్వీన్ ఎలిజబెత్-2, బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, సౌదీ అరేబియా రాజు సల్మాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తదితరులు దేశ ప్రజలకు భరోసా కల్పించేలా బహిరంగంగా టీకాను ముందుగానే తీసుకున్న సంగతి తెలిసిందే. .

>
మరిన్ని వార్తలు