Republic Day Celebrations 2024: ఇవాళ జెండా పండుగ. గణతంత్ర దినోత్సవం. అయితే ఇవాళ జెండా ఎగరేయడం అనొద్దు అంట. అది ముమ్మాటికీ తప్పంట. ఆవిష్కరించడం అనలాట. ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పైగా ఇవాళ జెండా ఆవిష్కరించబోయేది రాష్ట్రపతి. ఈ వేడుకలకు ప్రధాని హాజరైనా జెండా మాత్రం ఆవిష్కరించరు. ప్రధాని కేవలం స్వాత్రంత్య దినోత్సవం నాడు ప్రధాని జెండా ఎర్రకోటపై ఎగరేయడానికి.. జనవరి 26న రాష్ట్రపతి జెండా ఆవిష్కరించడానికి గల కారణం.. ఆ ఆనవాయితీ ఎన్నేళ్ల నుంచి కొనసాగుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి..
జనవరి 26 రిపబ్లిక్ డే, ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే.. ఈ రెండు తేదీలలో దేశవ్యాప్తంగా జెండాను రెపరెపలాడిస్తారు. పంద్రాగష్టున ప్రధాని ఎర్రకోటలో జెండా ఎగరేస్తారు. అయితే ఈ రోజు జనవరి 26న రాష్ట్రపతి న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో జెండా ఆవిష్కరిస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. కాబట్టే దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాం.
అదే ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగుతారు. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కాబట్టే.. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేశారు. అది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీక. అదలా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది.
నేడు రాష్ట్రపతి.. ఆరోజున ప్రధాని.. కారణం ఇదే..
ఇక్కడ గమనించాల్సిన మరో వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఘనంగా పరేడ్ నిర్వహిస్తారు. ఇక.. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి ప్రత్యేకంగా కారణం చెప్పనక్కర్లేదు. ఎర్రకోటపై జెండా ఎగరేశారక ఆయన ప్రసంగం ఇస్తారు.