Omicron Variant Updates In India: ‘ఒమిక్రాన్‌ కేసుల జోరు.. భారత్‌లో మూడో వేవ్‌, ఢిల్లీలో ఐదో వేవ్‌’

5 Jan, 2022 17:33 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌గా మార్పు చెంది మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ మూడవేవ్ ప్రారంభం కాగా.. ఢిల్లీలో ఐదో వేవ్ మొదలైందని ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు‌. బుధవారం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 10వేలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి చేరిందన్నారు. మరోవైపు ఢిల్లీలో.. గడిచిన 24 గంటల్లో 5వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటికే 2శాతం బెడ్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

ప్రైవేటు హాస్పిటల్స్‌లో 40శాతం పడకలు కరోనా రోగుల కోసం రిజర్వ్‌ చేయాలని ఆదేశాలు జారీచేసినట్టు మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. మంగళవారం కోవిడ్ -19 నిర్ధారణ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి గురించి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది, అయితే పూర్తి కోలుకునేంత వరకు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారని తెలిపారు. కేసుల పెరుగుదల ప్రారంభమైతే, అదే స్థాయిలో ఆక్సిజన్ డిమాండ్‌ అవసరముంటుందని వాటిని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని జైన్ చెప్పారు. గతంలో 50,000-55,000 పరీక్షలు జరిగేవని, అయితే ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 70,000-90,000 పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రారంభమైన ప్రయాణికుల కష్టాలు
కరోనా ఆంక్షల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతున్నాయి. 100శాతం సామర్థ్యంతో సేవలందించేందుకు మెట్రో, బస్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. పలు మెట్రో స్టేషన్ల వద్ద భారీగా జనం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మెట్రోల్లో కేవలం కూర్చుని ప్రయాణించేందుకే అనుమతి ఉంది. దీంతో సీట్ల సంఖ్యను మించి ఒక్కరిని కూడా రైల్లోకి భద్రతా సిబ్బంది అనమతి ఇవ్వడం లేదు. దీంతో ప్రయాణికులు తమ వంతు కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. 

చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి

మరిన్ని వార్తలు