CM Chauhan: జనాలు చస్తుంటే..రాజకీయాలా!

24 May, 2021 14:51 IST|Sakshi

భోపాల్‌: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. ప్రాణవాయువు అందక వందలాది మంది కరోనా బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే కోవిడ్‌పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'కాంగ్రెస్‌ టూల్‌కిట్‌' వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చల్లారడం లేదు. నిన్నటి వరకు ట్విట్టర్ వేదికగా టూల్‌కిట్‌ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు  కరోనా మ్యూటెంట్‌ పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.

కరోనా కారణంగా రాష్ట్రంలో లక్ష మందికి పైగా ప్రజలు మరణించారు.  చైనీస్‌ కరోనాగా ప్రారంభమై, ఇప్పుడు ఇండియన్‌ వేరియంట్‌ కరోనాగా మారింది. దీన్ని చూసి ప్రధాని, రాష్ట్రపతి భయపడుతున్నారు అంటూ మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ విమర్శించిన విషయం తెలిసిందే. 

అయితే తాజాగా మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందిస్తూ.. ఓ వైపు జనాలు ప్రాణాలు కోల్పోతుంటే..కాంగ్రెస్‌ పార్టీ దాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటుందని మండిపడ్డారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌ నాథ్‌ చేసిన కరోనా ‘‘ఇండియన్‌ వేరియంట్‌’’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దీనిపై సోనియా గాంధీ స్పందించకుండా ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తోందని దుయ్యబట్టారు. కమల్‌ నాథ్‌ మాటలను సోనియా అంగీకరిస్తుందా అంటూ ప్రశ్నించారు. ఇక ఈ రోజు రాష్ట్రంలో 7000 మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారన్నారు. కొత్తగా 2,936 కరోనా కేసులు మంది కరోనా బారిన పడినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.2 కి పడిపోయిందని పేర్కొన్నారు. అయిన్పటికీ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

(చదవండి: Toolkit రగడ: దుమ్మెత్తి పోసుకుంటున్న కాంగ్రెస్‌, బీజేపీ)

మరిన్ని వార్తలు