BJP Candidates List: కొడంగల్‌లో ‘బంటు’ సిద్దిపేటలో శ్రీకాంత్‌రెడ్డి

8 Nov, 2023 04:52 IST|Sakshi

12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం 

వేములవాడ నుంచి తుల ఉమ, మునుగోడు నుంచి చల్లమల్ల  

జనసేనతో పొత్తు స్పష్టత వచ్చాక మలి జాబితా 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితాను బీజేపీ అధిష్టానం మంగళవారం విడుదల చేసింది. కసరత్తు పూర్తి చేసిన తర్వాత 12 మంది అభ్యర్థులను బీజేపీ సీఈసీ ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటన జారీ చేశారు. బీజేపీ ఇప్పటివరకు నాలుగు జాబితాల్లో కలిపి 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేన పార్టీతో పొత్తు, సీట్ల అంశంపై జరుగుతున్న చర్చల్లో స్పష్టత వచ్చాక మిగిలిన అభ్యర్థులను ప్రకటించనుంది. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన వి.సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి స్థానాన్ని, చల్లమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు, తుల ఉమకు వేములవాడ, బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తికి హుస్నాబాద్‌ స్థానాన్ని కేటాయించింది.  

బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా.. 
చెన్నూరు(ఎస్సీ) – దుర్గం అశోక్, ఎల్లారెడ్డి– వి.సుభాష్‌రెడ్డి, వేములవాడ– తుల ఉమ, హుస్నాబాద్‌–బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, సిద్దిపేట– దూది శ్రీకాంత్‌రెడ్డి, వికారాబాద్‌ (ఎస్సీ) – పెద్దింటి నవీన్‌కుమార్, కొడంగల్‌– బంటు రమేశ్‌కుమార్, గద్వాల్‌– బోయ శివ, మిర్యాలగూడ– సాదినేని శివ, మునుగోడు– చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్‌ (ఎస్సీ)– నకిరకంటి మొగులయ్య, ములుగు(ఎస్టీ)– అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌. 

మరిన్ని వార్తలు