పోస్టర్ల కలకలం.. లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న అభ్యర్ధి

23 Mar, 2024 13:37 IST|Sakshi

సాక్షి, గాంధీ నగర్‌ : గుజరాత్‌ బీజేపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత, వడోదర ఎంపీ రంజన్‌బెన్‌ ధనుంజయ్‌ భట్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు వ్యక్తిగత కారణాల వల్ల రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. 
 
ఇటీవల బీజేపీ అధిష్టానం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. అందులో వడోదర స్థానం నుంచి రంజన్‌బెన్ భట్‌ను బీజేపీ మూడోసారి నామినేట్ చేసింది.

మేయర్‌ సస్పెండ్‌
అయితే, 2014, 2019 వరుసగా రెండు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినా కానీ ఆమె తన నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అందుకు ఊతం ఇచ్చేలా భట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వడోదర నగరం అంతటా పోస్టర్లు, బ్యానర్‌లు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా,అవినీతి ఆరోపణల కారణంగా రంజన్‌బెన్ భట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన బీజేపీ రాష్ట్రీయ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ డాక్టర్ జ్యోతి పాండ్యాను బీజేపీ అధిష్టానం 6 ఏళ్ల పాటు సస్పెండ్‌ చేసింది.  

కుట్ర కోణం
తనను ఎంపిక చేసినందుకు పెరిగిపోతున్న అసమ్మతిపై రంజన్‌బెన్ భట్ స్పందించారు. నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. ఎవరో కావాలనే ఇలా పోస్టర్లను అంటించారని మండి పడ్డారు. పార్టీ కార్యకర్తలు తన అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపారని, వడోదర ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల అంతటా నిర్వహిస్తున్న సమావేశాలను బట్టి  అర్ధమవుతుందని’ అని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా వడోదర ఎంపీ రంజన్‌బెన్‌ ధనుంజయ్‌ భట్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.   

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers