-

కాంగ్రెస్‌ ‘బాండ్‌ పేపర్లు’

28 Nov, 2023 02:41 IST|Sakshi
ప్రమాణం చేస్తున్న భట్టి విక్రమార్క   

ఆంజనేయస్వామి సన్నిధిలో అఫిడవిట్‌పై సంతకం చేసిన సీఎల్పీ నేత భట్టి 

సాక్షి, హైదరాబాద్, బోనకల్‌: ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఆరుగ్యారంటీలను తప్పకుండా అమ లు చేస్తామంటూ ఆ పార్టీ నేతలు బాండ్‌ పేపర్లు రాసిస్తున్నారు. సీఎల్పి నేత, మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కతో సహా పలువురు నేతలు ఈ మేరకు ప్రజలు బాండు పేపర్లు రాసిస్తున్నారు. అఫిడవిట్లపై సంతకాలు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బోనకల్‌ మండలంలోని చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ బాండ్‌ పేపర్‌పై భట్టి సంతకం చేశారు. దైవసన్నిధిలో సంతకం చేసిన ఈ బాండ్‌పేపర్‌లో ఉన్న అంశాలను బయటకు చదివి వినిపించారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆరుగ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని, మధిర నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాండ్‌ పేపర్‌లో పేర్కొన్న అన్ని అంశాలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. మాజీ ఎంపీ, హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ కూడా పొట్లపల్లి రాజరాజేశ్వర ఆలయంలో దైవసాక్షిగా అఫిడవిట్‌పై సంతకం చేసి ప్రమాణం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి కూడా ప్రజలకు తానిచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ బాండ్‌ పేపర్లు రాసిచ్చారు.

వీరితో పాటు చిట్టెం పరిణికారెడ్డి (నారాయణపేట), ఏనుగు రవీందర్‌రెడ్డి (బాన్సువాడ), ఆగం చంద్రశేఖర్‌ (జహీరాబాద్‌), గడ్డం వినోద్‌ (బెల్లంపల్లి), ఈర్ల శంకర్‌ (షాద్‌నగర్‌), వేముల వీరేశం (నకిరేకల్‌), కె.కె.మహేందర్‌రెడ్డి (సిరిసిల్ల), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు), మధుసూదన్‌రెడ్డి (దేవరకద్ర) తదితరులు దైవ సన్నిధానాల్లో, ప్రజల మధ్యన ఈ బాండ్‌పేపర్లపై సంతకాలు చేశారు.

మరిన్ని వార్తలు